సర్కార్ దవాఖానల్లో డయాగ్నో విప్లవం
నయా పైసా ఖర్చులేకుండా 57 రకాల టెస్టులు
ప్రభుత్వ వైద్యశాలలన్నింటికీ అనుసంధానం
శాంపిల్ ఇచ్చిన గంటల్లోనే మొబైల్ ఫోన్ లేదా ఈ మెయిల్కు రిపోర్టులు
పేదలకు తప్పిన వైద్య ఖర్చులు
సర్వత్రా హర్షాతిరేకాలు
ఆదిలాబాద్, జూలై 11 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి):జ్వరం, దగ్గు మరింకేదైనా కానీ, సర్కారు దవాఖాన మెట్లెక్కితే చాలు భరోసా దొరుకుతున్నది. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ప్రభుత్వం, పైసా ఖర్చు లేకుండా మెరుగైన సేవలందిస్తున్నది. కోట్లాది రూపాయలతో జిల్లాకో టీ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేసి, 57 రకాల టెస్టులు ఫ్రీగా చేస్తున్నది. సాధారణ రక్త, మూత్ర పరీక్షలతోపాటు డెంగీ, మలేరియా, టైఫాయిడ్, థైరాయిడ్, కొలెస్ట్రాల్, షుగర్, బీపీ.. ఇలాంటి పరీక్షలన్నింటినీ ఉచితంగా చేస్తున్నది. శాంపిల్ ఇచ్చిన గంటల్లోనే మొబైల్ ఫోన్ లేదా ఈ మెయిల్కు రిపోర్టులు వస్తుండగా, పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరుతున్నది.
పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ల క్ష్యంగా ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో అత్యాధునిక డ యాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్లో వీటిని ఏర్పాటు చేయగా, ఆయా చోట్ల పూ ర్తి సేవలందుతున్నాయి. పట్టణాలు, గ్రామీణ ప్రాం తాల నుంచి ప్రభుత్వ దవాఖానలకు వచ్చే వారికి వ్యాధి నిర్ధారణలో భాగంగా వివిధ పరీక్షలు అవసరమవుతాయి. గతంలో అన్ని రకాల వైద్యపరీక్షలు సర్కారు దవాఖానల్లో అందుబాటులో లేకపోవడం తో, ప్రైవేటు పరీక్షా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. దీం తో పేదలపై ఖర్చుల భారం పడేది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం పేదలకు అండగా నిలిచేందుకు జిల్లా కేంద్రాల్లోని ప్రధాన దవాఖానల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో డయాగ్నోస్టిక్ కేంద్రాలు నెల రోజుల కిందట ప్రారంభమయ్యాయి. ఒక్కో కేంద్రానికి రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ సెంటర్లో వివిధ రకాల వైద్య పరీక్షల కోసం అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేశారు. వివిధ వ్యాధులతో బాధపడుతూ వైద్యం కోసం సర్కారు దవాఖానకు వచ్చే పేదలకు 57 రకాల వైద్య సేవలను డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో ఉచితంగా నిర్వహించనున్నారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో..
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో రోజుకు 150 మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో వచ్చే వారి నుంచి శాంపిళ్లను సేకరించి డయాగ్నోస్టిక్ కేంద్రాలకు పంపిస్తారు. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కలిపి రూట్లు ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లాలో 22, నిర్మల్ జిల్లాలో 21 పీహెచ్సీలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 4 రూట్లు,నిర్మల్ జిల్లాలో 5 రూట్లు ఉన్నాయి. ప్రతి సెంటర్లో ఏడుగురు సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. ఆధునిక యంత్ర సామగ్రితో ల్యాబ్ టెక్నీషియన్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చి శాంపిళ్లను పరీక్షించి ఫలితాలను తెలియజేస్తున్నారు. ఈ కేంద్రంలో కిడ్నీ, లివర్ పనితీరు, థైరాయిడ్, 2డీఏకో, సీబీపీ, బయాస్పీ కల్చర్, సిరం, బొక్కలకు సంబంధించిన పరీక్షలు, ఐజీజీ, ఐజీఎం లాంటి ఖరీదైన వైద్య పరీక్షలతో పాటు 57 రకాల పరీక్షలు చేస్తారు. సెంటర్లోని ల్యాబ్ టెక్నీషియన్లు నమూనాలను పరిశీలించి, రాత్రి 8 గంటలకు నివేదికలు తయారు చేస్తారు. ఆయా పీహెచ్సీల నుంచి వచ్చే శాంపిళ్ల రిపోర్టులు ఆన్లైన్లో పంపిస్తారు. నివేదికల ఆధారంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు బాధితులకు వైద్యం అందిస్తున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రూ. 38 లక్షలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ సెంటర్లో పూర్తిస్థాయి సేవలు అందుతున్నాయి. గత నెల 9న ప్రారంభమైన ఈ కేంద్రంలో ఇప్పటి వరకు దాదాపు 3200 పరీక్షలు చేశారు.
జిల్లాలోని 15 మండలాల్లోని పీహెచ్సీల్లో రోగుల నుంచి సేకరించే నమూనాలను వైద్య సిబ్బంది ఈ కేంద్రానికి తీసుకవచ్చి, ఒక్క రోజులోనే పరీక్షలు నిర్వహించి రిపోర్టులను తిరిగి కేంద్రాలకు పంపిస్తున్నారు. ఇందుకు మూడు రూట్స్గా విభజించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనం ద్వారా శాంపిళ్లను తీసుకువచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి ఒంటిగంట లోపు రోగుల నుంచి శాంపిళ్లు సేకరిస్తున్నారు. మరునాడు ఉదయం రిపోర్టులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరుస్తున్నారు. ఒక గంట వ్యవధిలో 5 వేల పరీక్షలు చేయగల సామర్థ్యం ఈ డయాగ్నోస్టిక్ సెంటర్కు ఉంది.