మెహిదీపట్నం, జూలై 9: ఆషాఢ మాసం బోనాలు రేపటినుంచి ప్రారంభంకానున్నాయి. గడిచిన ఏడాది కరోనా కారణంగా ఉత్సవాలకు దూరమైన ప్రజలు ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఆదివారం గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో మొదటి బోనం సమర్పించనున్నారు. దీంతో నగర వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకోనున్నది. ఇప్పటికే సీఎం కేసీఆర్ బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించగా.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయ ట్రస్టు కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు లంగర్హౌస్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగదాంబిక ఎల్లమ్మకు మంత్రులు పట్టువస్ర్తాలను సమర్పించడంతో ఊరేగింపు ప్రారంభమవుతుంది. కులవృత్తుల సంఘం తరఫున నజర్ బోనంను ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పిస్తారు. జూలై 11న మొదటి బోనం.. ఆగస్టు 8వ తేదీన 9వ బోనం సమర్పించనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకునేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.