సిటీబ్యూరో, జూలై 9(నమస్తే తెలంగాణ): వచ్చే సెప్టెంబర్ 30 వరకు మోటార్ వాహనాల డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), ఇతర పర్మిట్ పత్రాల గడువు కొనసాగుతుందని, సంబంధిత పత్రాల గడువు ముగిసిందని ఏ అధికారి వారిపై చర్యలు తీసుకోవడానికి వీలు లేదని ఆర్టీఏ ఉన్నతాధికారులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు, కొవిడ్ దృష్ట్యా 2020 ఫిబ్రవరి 1తో గడువు ముగిసిన పత్రాలు ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేశారు. అయితే, వాహనదారులు రెన్యూవల్ చేసుకునే వెసులుబాటు కార్యాలయాల్లోనూ.. ఆన్లైన్లోనూ ఉందని సూచించారు. సేవలను వినియోగించుకుని సంబంధిత పత్రాలను రెన్యూవల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. పత్రాల గడువు పూర్తయిందని ట్రాఫిక్ పోలీస్, ట్రాన్స్పోర్ట్ అధికారులు వాహనదారులపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని సూచించారు. కాల పరిమితికి సంబంధించి ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.