హుస్నాబాద్/బెజ్జంకి, జూలై 9: సీఎం కేసీఆర్ దూరదృష్టితో చేసిన కృషి కారణంగానే తెలంగాణలో పల్లెలన్నీ సుభిక్షంగా మారుతున్నాయని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఒకప్పుడు గ్రామాల్లో పంటలు పండక, ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ్డాక గ్రామ అవసరాలను గుర్తించిన సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం, ఉపాధి అవకాశాలను మెరుగు పర్చడంతో వలసలు పూర్తిగా తగ్గిపోయాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను సంపూర్ణంగా మార్చి వేసిందన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంతో పాటు మండలంలోని కల్లెపల్లిలో రైతు వేదికలు, పలు అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. కల్లెపల్లిలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం, మిడ్మానేరు, అనంతగిరి, తోటపల్లి వంటి తదితర సాగునీటి ప్రాజెక్టులతో బెజ్జంకి లాంటి మెట్ట ప్రాంతాలు సస్యశ్యామలం అయ్యాయ్యన్నారు. 70 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరుగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ కేవలం ఏడేండ్లలో చేసి చూపించారన్నారు.
కాలంతో పనిలేకుండా మూడు పంటలకు సాగునీటిని అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశారని వివరించారు. రైతుబంధు, రైతుబీమా, పంట పెట్టుబడి సాయం వంటి పథకాలు అమలు చేస్తూ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రో, డీజిల్ ధరలను పెంచి డబ్బులు గుంజుతున్నదని మంత్రి విమర్శించారు. ఒకప్పుడు పంటలు పండటమే గగనంగా ఉన్న తెలంగాణ పల్లెలు, ఇప్పుడు దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగాయంటే సీఎం కేసీఆర్ కృషి కారణం అన్నారు. మెట్ట ప్రాంతమైన బెజ్జంకి మండల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఇప్పటికే మండలంలోని 16 గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాలు మంజూరు చేయగా, చివరి దశకు చేరుకున్నాయన్నారు.
మండలంలో కొత్త గ్రామ పంచాయతీలు, మహిళా సమాఖ్యలకు భవనాలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. కల్లెపల్లిలో ఫంక్షన్హాల్, కల్వర్టు నిర్మాణానికి వెంటనే అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పోతారం నుంచి వడ్లూర్, రేగులపల్లి నుంచి చీలాపూర్ మీదుగా బెజ్జంకి వరకు రోడ్డు మంజూరు చేశానని గుర్తు చేశారు. రైతులు వ్యవసాయంలో ఆధునిక విధానాలు అవలంభించి మంచి దిగుబడులు సాధించాలని కోరారు. ఆయిల్పాం, పట్టు పురుగుల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వరి వెదజల్లే పద్ధతి ద్వారా అనేక లాభాలు ఉన్నాయని, రైతులు ముందుకు రావాలని, ఈ దిశగా వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి హరీశ్రావు సూచించారు.
రూ.300 కోట్లతో మండల అభివృద్ధి..