మోత్కూరు, జూలై 7: విధ్వంసమైన పల్లె జీవన విధానం పునరుద్ధరణ చేసి ఆత్మగౌరవంతో ప్రజలు జీవనం సాగించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని దాచారం గ్రామంలో పల్లె ప్రగతిని నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత కాలనీలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. కాలినడకన వీధుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన సభలో మాట్లాడారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే పల్లె జీవన విధానం విధ్వంసమైందన్నారు. ఎన్నో ఏండ్ల ప్రజల ఆకాంక్ష పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో గ్రామాలు బాగు చేసుకోవడం కోసం ప్రజలు సహకరించాలన్నారు. కోట్లాది రూపాయలతో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ.50వేల కోట్ల నిధుల కేటాయింపుతో దళిత సాధికారిత పథకంతో దళిత వాడలే కొత్త కాంతులు నింపుకోనున్నాయని తెలిపారు. అర్హులైన పేదలకు రూ.10లక్షలను అందజేసి ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా కృషి చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో హరితహారం కింద 240వేల కోట్ల మొక్కలను ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయనున్నదని వివరించారు. రూ.2కోట్లతో మూసీ నది నీటి లిప్టు పథకం ద్వారా దాచారం చెరువును నింపి రైతులకు సాగు నీటి వసతి కల్పించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రూ.45లక్షలతో మెగా పార్కును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రూ.10లక్షలు హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణం, రూ.8లక్షలు బీసీ(యాదవ సంఘం)కమ్యూనిటీ హాల్, ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రహరీ నిర్మాణానికి రూ.2లక్షలు, అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూ.25లక్షల నిధులు మంజూరుకు కృషి చేయనున్నట్లు వివరించారు. గ్రామంలోని దళితులకు చెందిన 273, 351 సర్వే నంబర్లలో ఉన్న భూముల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ప్రత్యేక సర్వేటీమ్ ద్వారా హద్దులను ఏర్పాటు చేస్తాం : భువనగిరి ఆర్డీవో భూపాల్రెడ్డి
దాచారం గ్రామంలోని 273 సర్వే నంబర్లో 301.39 ఎకరాలు, 351 సర్వే నంబర్లో 79.26 ఎకరాల భూమి వివాదం పరిష్కారానికి ప్రత్యేక సర్వేటీమ్ ద్వారా కొలతలు చేసి హద్దుల ఏర్పాటుకు కృషి చేయనున్నామని భువనగిరి ఆర్డీవో ఎంవీ భూపాల్రెడ్డి తెలిపారు. పల్లె ప్రగతి గ్రామ సభకు హాజరైన ఆయన గ్రామస్తుల భూమి వివాదంపై స్థానికుల విన్నపం మేరకు ఆయన స్పందించి మాట్లాడారు. గ్రామంలోని ప్రభుత్వ భూమిని ఇప్పటికే ప్రభుత్వ అవసరాలకు కేటాయించినట్లు తెలిపారు. అసైన్డ్ భూమిలో వివాదాన్ని సర్వే చేసి అర్హులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్ అండెం రజితారాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో జడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోష్రెడ్డి, ఎంపీటీసీ రచ్చ కల్పనాలక్ష్మీనర్సింహ్మరెడ్డి, రైతు సహకార సం ఘం చైర్మన్ కంచర్ల అశోక్రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ కొండ సోంమల్లు, జిల్లా బీసీ సంక్షేమాధికారి బి.యాద య్య, ఎంపీడీవో మనోహర్రెడ్డి, తహసీల్దార్ షేక్ అహ్మద్, సర్వే ల్యాండ్స్ ఏడీ వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేవూరి ధర్మేందర్రెడ్డి, మాజీ సర్పంచ్ కడమంచి వస్తాద్, మాజీ ఎంపీటీసీ యాదగిరి పాల్గొన్నారు.