హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి పతకాలు సాధించాలని, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, సదుపాయాల కల్పనకు సీఎం కేసీఆర్ అనేక ప్రోత్సాహకాలు ప్రకటించారని చెప్పారు. గచ్చిబౌలి బ్యాడ్మింటన్ స్టేడియంలో టోక్యో ఒలింపిక్స్కు వెళ్లే క్రీడాకారులు, కోచ్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తరువాత క్రీడాకారులకు రూ.25.87 కోట్ల నగదు ప్రోత్సాహకాలను అందించామన్నారు. వివిధ క్రీడా సంఘాలకు రూ.9 కోట్లు అందించి క్రీడలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు.
తెలంగాణను క్రీడాహబ్గా తీర్చిద్దేందుకు క్రీడా పాలసీ తయారీకి, క్రీడల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం సీఎం కేసీఆర్ క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత క్రీడాకారులకు ఉన్నత విద్యలో 0.5 శాతం, ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నామన్నారు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్స్ షిప్లు, కామన్వెల్త్ లాంటి అంతర్జాతీయ వేదికల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకిచ్చే నగదు పురస్కారాన్ని గతంలో కంటే ఎక్కువగా అందిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు ఇచ్చేవారని.. తెలంగాణ ఏర్పడిన తరువాత రూ.2 కోట్లు అందిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా రజత పతకం సాధిస్తే గతంలో రూ.25 లక్షలు ఇస్తే.. ఇప్పుడు రూ.కోటి, కాంస్య పతకానికి రూ.10 లక్షలు ఇస్తే నేడు రూ.50 లక్షల పురస్కారాన్ని అందిస్తున్నామని చెప్పారు.
అంతకుముందు హైదరాబాద్లోని తన నివాసంలో సానియా మీర్జా తండ్రిని మంత్రి సన్మానించారు. సానియా మీర్జా టోక్యో ఒలింపిక్స్కు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తరఫున తండ్రి ఇమ్రాన్ మీర్జాను ఘనంగా సన్మానించారు. ఆయనకు రూ.5 లక్షల విలువైన చెక్ను అందించారు.