రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ
ముస్లిం మతపెద్దలతో సమావేశం
గర్మిళ్ల, జూలై 6 : బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని రామగుండం సీపీ సత్యనారాయణ సూచించారు. మంచిర్యాల ఏసీపీ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో మంగళవారం రాత్రి సమావేశం ఏర్పాటు చేశారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవడానికి సలహాలు, సూచనలు అడిగి తెలసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రభుత్వం గోవధను నిషేధించిందని , గోవధ చేసినా.. అక్రమంగా రవాణ చేసినా.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మూడు రోజుల పాటు ఖుర్బానీ రోజుల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కించపరిచే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ చిన్న సంఘటన జరిగినా పోలీసులు, డయల్ 100కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఉదయ్కుమార్ రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్, పట్టణ సీఐ ముత్తి లింగయ్య, రూరల్ సీఐ కుమారస్వామి, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచి సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు ప్రవీణ్కుమార్, దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.