టొరంటో: స్మార్ట్ఫోన్ సాయంతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా కెనాడా శాస్త్రవేత్తలు నూతన విధానాన్ని కనిపెట్టారు. కొవిడ్-19 పరీక్షను చాలా సులువుగా నిర్వహించడంతోపాటు బాధితుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించేలా ఆ విధానం ఉన్నది. స్మార్ట్ఫోన్ కెమెరా సాయంతో చేపట్టే ఈ పరీక్ష వల్ల కరోనా వైరస్ను వేగంగా గుర్తించవచ్చు. సాధారణంగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో నమూనాలను సేకరించడం, వాటిని ల్యాబ్కు పంపడం, పరీక్ష నిర్వహించడం, ఫలితాన్ని తెలియజేయడం వంటి అనేక దశలు ఉంటాయి.
అందువల్ల ఫలితం రావడానికి చాలా సమయం పడుతున్నది. ఈ నేపథ్యంలో స్మార్ట్ఫోన్ ఆధారిత క్వాంటమ్ బార్కోడ్ సీరోలాజికల్ ఆనే సాధనాన్ని టొరంటో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందుకోసం క్వాంటమ్ డాట్ బార్కోడ్తో కూడిన సూక్ష్మ పూసలను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. అలాగే రోగి రక్తంలో కొవిడ్-19 యాంటిజెన్కు సంబంధించిన యాంటీబాడీలను గాలించేందుకు సెకండరీ లేబుల్ను రూపొందించారు.
రక్త నమూనాలో యాంటీబాడీలు ఉంటే సూక్ష్మపూస రంగు మారిపోతుంది. ఆ తర్వాత స్మార్ట్ఫోన్ కెమెరాతో ఈ పూసను క్లిక్మనిపించాలి. ఫోన్లోని ప్రత్యేక యాప్ ఈ ఫొటోను ప్రాసెస్ చేసి, పూసలో చోటుచేసుకున్న మార్పులను విశ్లేషిస్తుంది. అంతిమంగా ఈ డేటా సమగ్ర మదింపు జరిపి, ఆ వివరాలను తెలియజేస్తుంది. వాటిని వైద్య నిపుణులకూ పంపుతుంది. రక్త నమూనాలోని కీలక బయోమార్కర్లు స్వల్ప స్థాయిలో ఉన్నా ఇది గుర్తిస్తుందని పరిశోధకులు తెలిపారు.