వెంగళరావునగర్, జూన్ 11: వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నాయి.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా, అల్కాపురికాలనీకు చెందిన పీత సత్యనారాయణ రెండవ కుమార్తె విజయశ్రీకు 9 ఏండ్ల క్రితం నిఖిల్తో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు. అత్తామామలతో కలిసి బోరబండలోని ఓ అపార్టుమెంట్లో ఉంటున్నారు. ఏడాది క్రితం లాక్ డౌన్ కారణంగా విజయశ్రీ ఉద్యోగానికి రాజీనామా చేసింది. అప్పటి నుంచి అత్త తులసీ వేధింపులు పెరిగిపోయాయి. దీనికితోడు నీవు ఉద్యోగం బంద్ చేయడం వల్ల రూ.4లక్షలు నష్టపోయామని.. ఆ డబ్బులు తీసుకురావాలని వేధిస్తుంది.. రోజు రోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైంది.. గురువారం మధ్యాహ్నం అత్తామామలకు భోజనం పెట్టి..పిల్లలకు చివరిసారిగా గోరు ముద్దలు తినిపించింది.. ఆ తర్వాత గదిలోకి వెళ్లి..ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది.. నాకు బతకాలని లేదు.. జీవితం చాలా కష్టంగా ఉంది..అందుకే చనిపోవాలనుకుంటున్నాను అంటూ ఫోన్ లో ఉన్న సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. మృతురాలి తండ్రి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఏపీ, విశాఖపట్నం, కంపవానిపాలెంకు చెందిన రాజబాబుకు ఇద్దరు భార్యలు.. మొదటి భార్యకు కూతురు, రెండో భార్యకు కుమారుడు ఉన్నాడు.. రెండో భార్య రమణమ్మతో ఎస్సార్నగర్లోని బీకేగూడలో నివాసముంటున్నాడు.. కాగా.. ఐదు నెలల క్రితం మొదటి భార్య చనిపోయింది. అప్పటి నుంచి రాజబాబు మానసికంగా కుంగిపోయాడు. శుక్రవారం ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అమీర్పేట ధరంకరం రోడ్డుకు చెందిన నిర్భయ్ కొఠారి(35), రుచిక దంపతులకు 5 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కూతురు ఉంది. కాగా.. దంపతులు తరచూ గొడవ పడుతుండేవారు.. ఈ క్రమంలో గత రెండేళ్ల క్రిత రుచిక కూతురును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.. దీంతో నిర్భయ్ కొఠారి మనస్తాపానికి గురైయ్యాడు. భార్య ఎంతకీ రాకపోవడంతో శక్రవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బేగంపేట రైల్వే స్టేషన్ సమీపంలోని బస్తీలో సయ్యద్ సందార్ మియా(65).. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో కాపలాదారుడిగా పనిచేస్తున్నాడు. ఇటీవల జగన్మోహన్రెడ్డి మరణించాడు.. అతని కుమారులు సందాబ్ మియాను ఇంట్లోనే ఉంచారు. కాగా.. ఆజంపురాలో ఉండే సోదరుడి కూతురు తాహెరాబేగం శుక్రవారం ఇంటికి వెళ్లి చూసేసరికి సందార్ మియా మామిడి చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి. అనారోగ్యం కారణంగా సందార్ మియా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు ఆయా కేసులను నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.