బ్యాంకుల విలీనంతో రైతుబంధుకు ఇబ్బంది లేదు
కొత్త రైతులు 10లోగా ఏఈవోకు వివరాలివ్వాలి
15 నుంచి ఖాతాల్లో జమ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడి
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): పలు బ్యాంకుల విలీనంతో రైతుబంధు పంపిణీకి ఎలాంటి ఆటంకం లేదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఆయా బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెప్పారు. పాత ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ల ఆధారంగానే నిధులు జమ అవుతాయని పేర్కొన్నారు. విలీనమైన బ్యాంకులకు సంబంధించి మళ్లీ కొత్తగా అకౌంట్ నంబర్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. వానకాలం రైతుబంధు పంపిణీపై ఆదివారం మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హులైన కొత్త లబ్ధిదారులు, పాస్బుక్లలో అదనంగా భూమి చేరినవారు తమ పాస్బుక్, అకౌంట్ నంబర్ వివరాలను ఈ నెల 10వ తేదీలోగా ఆయా మండలాల ఏఈవోలకు అందించాలని సూచించారు. ఆ తేదీ వరకు సీసీఎల్ఏ ద్వారా ధరణి పోర్టల్లో నమోదైన అర్హులైన ప్రతి రైతు ఖాతాలో పంట పెట్టుబడిసాయం జమచేయనున్నట్టు తెలిపారు.