ఐదేండ్ల క్రితమే ప్రగతిభవన్ వేదికగా తనకు అవమానం జరిగిందని చెప్తున్న ఈటల ఆనాడే ఎందుకు రాజీనామా చేయలేదు? అవమానం జరిగిన చోట ఉండనని పదేపదే చెప్తున్న ఈటల.. అదే పార్టీ బీఫారంపై ఎందుకు పోటీ చేశారు? తిరిగి మళ్లీ మంత్రివర్గంలో ఎందుకు చేరారు? ప్రభుత్వ నిర్ణయాల్లో ఎందుకు భాగస్వాములయ్యారు?
కరీంనగర్, జూన్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మాజీ మంత్రి ఈటల రాజేందర్ సొంత ప్రయోజనాల కోసం ఎంతదూరమైనా దిగజారుతారని, ప్రస్తుతం అదే పంథాలో వెళ్తున్నారని.. ఆస్తులు కాపాడుకునేందుకు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే ఇందుకు నిదర్శనమని మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలో శుక్రవారం మీడియా సమావేశంలో మంత్రు లు మాట్లాడారు. ఏమాత్రం ఆత్మాభిమా నం ఉన్నా ముందుగా తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్చేశారు. ఈటలచెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవన్నీ తప్పుడు పనులన్నీ ఎద్దేవాచేశారు.
ఆనాడే రాజీనామా చేయలేదేం? : మంత్రి కొప్పుల
ఐదేండ్ల క్రితమే ప్రగతిభవన్ వేదికగా తనకు అవమానం జరిగిందని చెప్తున్న ఈటల ఆనాడే ఎందుకు రాజీనామా చేయలేదని మంత్రి కొప్పుల ప్రశ్నించారు. అవమానం జరిగిన చోట ఉండనని పదేపదే చెప్తున్న ఈటల.. అదే పార్టీ బీఫారంపై ఎందుకు పోటీ చేశారు? తిరిగి మళ్లీ మంత్రివర్గంలో ఎందుకు చేరారు? ప్రభుత్వ నిర్ణయాల్లో ఎందుకు భాగస్వాములు అయ్యారు? అని నిలదీశారు. ప్రగతిభవన్ బానిస భవన్ అయిందని అంటున్న ఈటల ఇన్నాళ్లు అక్కడ జరిగిన సమావేశాలకు ఎందుకు హాజరయ్యారని ప్రశ్నించారు. దేశానికి దిక్సూచిగా ఎన్నో పథకాలకు వేదికగా నిలిచిన ఆ భవన్లో జరిగిన ప్రతి సమావేశంలో మీరు భాగస్వాములు ఆయ్యారు కదా.. అప్పుడు గుర్తుకురాని బానిస భవన్ ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నదని నిలదీశారు. బెంజ్ కార్లలో తిరిగే వారికి రైతుబంధు వర్తింప చేయవద్దని చెప్పానంటున్న మాజీమంత్రి, బెంజ్కార్లలో తిరుగుతున్న మీ కుటుంబ సభ్యులు ఏటా రూ.10.24 లక్షల రైతుబంధు డబ్బులను ఎందుకు తీసుకుంటున్నారో సమాధానంచెప్పాలని డిమాండ్చేశారు. బడుగులపై ప్రేమ ఉంటే.. వారి నుంచి చట్టవిరుద్ధంగా కొనుగోలు చేసిన భూములను వారికి తిరిగి ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలను చేసిందని, అవి నల్లచట్టాలని వాటిని రద్దుచేసే వరకు పోరాడుతామని చెప్పిన ఈటల అదే పార్టీలో ప్రస్తుతం కలుస్తున్నారు కదా? ఇది ఆత్మగౌరవమా.. లేక ఆత్మవంచనా చెప్పాలన్నారు. మంత్రులకు స్వేచ్ఛ లేదంటూ మీ అభిప్రాయాన్ని ఇతర మంత్రులకు రుద్దాలని చూడవద్దని సూచించారు.
బలహీనవర్గాల సంక్షేమం గురించి పట్టించుకొన్నారా?: గంగుల
బలహీన వర్గాల ఆత్మగౌరవం అంటున్న ఈటల రాజేందర్.. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా వారిగురించి పట్టించుకొన్నారా అని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేర్చుకుంటున్నామని చెబుతున్న బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. ఈటల అక్రమంగా కొనుగోలు చేసిన అసైన్డ్ భూములను తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. రాముడి పేరుతో గుడి కడుతున్న మీరు.. అదే రాముడి భూములను కైవసం చేసుకున్న ఈటలను ఎలా చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తే కేసీఆర్ బొమ్మపైనే ప్రజలు ఓటేస్తారని, ఏ అభ్యర్థిని పెట్టినా టీఆర్ఎస్ వంద శాతం గెలుస్తందని స్పష్టంచేశారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కరీంనగర్ మేయర్ సునీల్రావు తదితరులు పాల్గొన్నారు.
ఆస్తుల కోసమే ఆత్మగౌరవ నాటకం
కేసీఆర్ బొమ్మతోనే గెలిచారు: బస్వరాజు సారయ్య
జమ్మికుంట/హుజూరాబాద్టౌన్, జూన్ 4: అక్రమాస్తులను కాపాడుకొనేందుకే ఈటల రాజేందర్ ఆత్మగౌరవం పేరిట నాటకం ఆడుతున్నారని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య దుయ్యబట్టారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, జమ్మికుంటలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈటలకు సీఎం కేసీఆర్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని, పార్టీ బీ పారం ఇచ్చి గెలిపించారని తెలిపారు.
సంపాదన కోల్పోయిన బాధే: వకుళాభరణం
హుజూరాబాద్ రూరల్, జూన్ 4 : గతంలోనే తన ఆత్మగౌరవానికి భంగం కలిగిందంటున్న ఈటల రాజేందర్ ఆనాడే పార్టీకి, పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, టీఆర్ఎస్ నేత వకుళాభరణం కృష్ణమోహన్రావు ప్రశ్నించారు. ఇంకొంత కాలం మంత్రి పదవిలో ఉండి ఇంకా సంపాదించుకొనే అవకాశం కోల్పోయాననే బాధ, ఆక్రోశం ఈటల మాటల్లో కనిపిస్తున్నదని పేర్కొన్నారు. ఉద్యమంలో ఎన్నో అవమానాలు భరించి మృత్యువు నోట్లో తలపెట్టి రాష్ట్రం సాధించిన కేసీఆర్ను నియంత అనటం ఈటల దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
స్వప్రయోజనాల కోసమే బీజేపీలోకి: సత్యవతి
మహబూబాబాద్, జూన్ 4: ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం ఆత్మగౌరవం కోసం కాదని.. తన ఆస్తుల రక్షణ కోసమని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. శుక్రవారం మహబూబాబాద్లోని తన నివాసంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణలో ప్రతి సామాన్యుడు పవర్ఫుల్ వ్యక్తేనని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఏడేండ్లుగా తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న బీజేపీలో చేరి తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టుపెట్టారని ఘాటుగా విమర్శించారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.