పెద్దపల్లి : జిల్లాలోని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎన్టీపీసీ, గోదావరిఖని, యైటింక్లైన్ కాలనీలలో పెద్దపల్లి డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఇష్టానుసారంగా బయట తిరిగితే కేసులు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న ఆకతాయి యువకులను పోలీసులు ఐసోలేషన్కు పంపించారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ..కరోనా నుంచి ప్రజలను రక్షించడానికి పోలీసులు రోడ్లపై ఉంటూ నిరంతరం ప్రజల కోసం పని చేస్తున్నారు. కొంతమంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారు. గల్లీల్లో, రోడ్లపై ఆకతాయిలు ఎంత చెప్పినా వినకుండా తిరుగుతున్నారని ఆయన తెలిపారు.
వారిని సుల్తానాబాద్ ఐసోలేషన్ కి ప్రత్యేక వాహనంలో తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇకపై ప్రతి రోజు ఉదయం 10 గంటల తరువాత అనవసరంగా రోడ్లపై తిరిగితే వారిని ఐషోలేషన్ వ్యాన్లో సుల్తానాబాద్ కి పంపిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐపీఎస్ అధికారి నికిత పంత్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, సీఐలు, ఎస్ఐలు ఉన్నారు.