హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) రిఫైనరీలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించి, దట్టమైన పొగలతో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఉద్యోగులను బయటకు పంపారు. ప్రమాద సమయంలో యూనిట్లో ఆరుగురు సిబ్బందితోపాటు మరికొందరు కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. ముడి చమురును ఈ యూనిట్లోనే ప్రాసెసింగ్ చేస్తారు. ఈ ప్రమాదంలో యూనిట్ మొత్తం మంటలు వ్యాపించినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరుగలేదని విశాఖ కలెక్టర్ విజయ్చంద్ తెలిపారు. ఎవరికీ గాయాలు కూడా కాలేదని చెప్పారు.