హైదరాబాద్ సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు ఇద్దరు వ్యాపారులను బురిడీ కొట్టించి రూ.15.18 లక్షలు దోచుకున్నారు. అగ్గువకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇస్తామంటూ ఒకరి వద్ద రూ.13.94 లక్షలు, ఆన్లైన్లో మేకలు అమ్ముతామంటూ మరొకరి వద్ద రూ.1.24 లక్షలు లాగేశారు. హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన వ్యాపారి మే 14న ఇండియా మార్ట్ ఆన్లైన్లో అక్సిజన్ కాన్సన్ట్రేటర్లు సరఫరా చేసే కంపెనీల గురించి వెతికాడు. మరుసటిరోజు అతనికి ఓ గుర్తుతెలియని మహిళ ఫోన్ చేసి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల కోసం వెతుకుతున్నారు కదా.. ‘మా జయంత్ మెడికల్ అండ్ సర్జికల్ కంపెనీ’ అత్యంత తక్కువ ధరకు ఐదులీటర్ల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను 38 వేలకు, 10 లీటర్లది 48 వేలకు విక్రయిస్తున్నట్టు తెలిపింది. ఆర్డర్ నమోదుకు ముందుగా రూ.48 వేలు చెల్లించాలని సూచించింది. ఆ మేరకు వ్యాపారి రూ.48 వేలు బదిలీ చేశాడు. తర్వాత మళ్లీ ఫోన్ చేసి.. ‘ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పంపాం.. డెలివరీ అయ్యి విమానాశ్రయానికి వచ్చాయి.. కానీ.. తనిఖీల్లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు’ అని నమ్మించి మొత్తం రూ.13.94 లక్షలను దోచేశారు. ఇంకా డబ్బు అడుగుతుండటంతో వ్యాపారికి అనుమానం వచ్చి రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
టోలిచౌకీకి చెందిన అన్సారీ.. ఆన్లైన్లో మేకల విక్రయాల గురించి సెర్చ్ చేశాడు. జుబేర్ఖాన్ ఓనర్ ఆఫ్ టీఎస్ గోట్ ఫామ్ పేరుతో గూగుల్లో ఒకపోస్టు కనిపించింది. అక్కడున్న నంబర్కు అన్సారీ ఫోన్చేశాడు. తమది రాజస్థాన్ అని హోల్సేల్ ధరల్లో మేకలను విక్రయిస్తున్నామంటూ నమ్మించాడు. 10 మేకలు కోసం.. రూ.1.34 లక్షలకు ఒప్పందం చేసుకున్న అన్సారీ.. ఈ నెల 8వ తేదీ నుంచి అడ్వాన్స్గా కొంత చెల్లించాడు. ఆ తర్వాత మరికొంత ఇలా రూ.1.24 లక్షల వరకు అన్సారీ చెల్లించాడు. ఆపై ఎదుటి వ్యక్తి ఫోన్ స్విచ్చాఫ్ అయ్యింది. రెండుమూడు రోజులుగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో మంగళవారం సీసీఎస్ సైబర్క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు.