తిరువనంతపురం : కేరళ శాసన సభ స్పీకర్గా పాలక్కడ్లోని త్రిథల ఎమ్మెల్యే, ఎల్డీఎఫ్ అభ్యర్థి ఎంబీ రాజేశ్ ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్ పీటీఏ రహీం స్పీకర్ ఎన్నికకు మంగళవారం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో రాజేశ్కు 96 ఓట్లు, యూడీఎఫ్ అభ్యర్థి కొల్లాం కుందారా నుంచి ఎన్నికైన పీసీ విష్ణునాథ్కు 40 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీలో 140 స్థానాలుండగా.. ఎల్డీఎఫ్ కూటమికి 99 మంది సభ్యులు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి 41 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఎన్నిక అనంతరం కొత్త అసెంబ్లీ స్పీకర్ను సీఎం పినరాయి విజయన్, ప్రతిపక్ష నేత వీడీ సతీసన్ కలిసి కుర్చీ వద్దకు తీసుకెళ్లారు.
అనంతరం కొత్త స్పీకర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ప్రొటెం స్పీకర్ ఓటింగ్ చేపట్టారు. కొవిడ్ ప్రొటోకాల్స్ మేరకు సభ్యులంతా వచ్చి ఓటు వేయగా.. 9.50 పోలింగ్ ముగిసింది. ఆ తర్వాత ఓట్లు లెక్కించగా.. రాజేశ్ గెలుపొందారు. రాజేశ్ వృత్తిరీత్యా న్యాయవాది కాగా.. కేరళ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్, ఒట్టపాలంలోని ఎన్ఎస్ఎస్ కళాశాల నుంచి ఎకనామిక్స్లో పట్టా పొందారు. వరుసగా రెండుసార్లు పార్లమెంట్కు ఎన్నికవగా.. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికయ్యారు.