హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): కరోనాతో ప్రజలు విలవిల్లాడుతుంటే.. మరోవైపు చికిత్సకు ఉపయోగించే మందులను బ్లాక్లో విక్రయిస్తూ, మెడికల్ మాఫియా చెలరేగిపోతున్నది. ఇంటిదొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడన్న చందంగా మెడికల్ విభాగాల్లో పనిచేసేవారే ముఠాలు కట్టి, మాఫియాలుగా తయారై, సామాన్యులను పీల్చి పిప్పి చేస్తున్న తీరు ఘోరం. బ్లాక్ మార్కెటింగ్ ముఠాలను పోలీసులు వరుసగా అరెస్టులు చేస్తున్నా.. రోజుకో దగ్గర దందా కొనసాగుతూనే ఉన్నది. బ్లాక్ దందాలో పాల్గొంటున్నవారిలో 98 శాతం మంది మెడికల్ ఫీల్డ్తో సంబంధమున్నవారే కావడం గమనార్హం. దవాఖానాల్లో పనిచేస్తున్నవారు, మెడికల్ షాపుల నిర్వాహకులు, డిస్ట్రిబ్యూటర్లు, రిప్రజెంటేటివ్లు, ల్యాబ్ల్లో పనిచేస్తున్నవారితో కొంతమంది ముఠాలు కట్టి బ్లాక్దందా నడిపిస్తున్నారు. అత్యవసర మందులు అవసరమైనవారిని గుర్తించడం మొదలుకొని వాటిని విక్రయించే వరకు ఈ ముఠా యాక్టివ్గా పనిచేస్తుంది. కరోనా చికిత్సలో వాడే రెమిడెసివర్ ఇంజక్షన్లు, బ్లాక్ఫంగస్ చికిత్సకువాడే అంపోటెరిసిన్ బీ లిపోజమ్ ఇంజక్షన్లు ఎవరికి అవసరమో గుర్తించి, అవి ఫలానా చోట దొరుకుతాయంటూ ఈ ముఠాలే వారికి క్లూ ఇస్తున్నాయి. బాధితులు ఆయా మెడికల్ షాపులకు వెళ్తున్నారు. తీరా అక్కడికి వెళ్లాక.. ‘అవి మా వద్ద దొరకవు. ఫలాన వ్యక్తి విక్రయిస్తున్నాడ’ంటూ నమ్మించి, వాటిని బ్లాక్లో విక్రయిస్తున్నారు. సామాన్యులు ఇంజక్షన్లు దొరకక విలవిలలాడుతున్నారు. కొవిడ్తో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలనే ఈ మెడికల్ మాఫియా లక్ష్యంగా చేసుకుంటున్నది. అవసరమున్న వారెవ్వరూ గుట్టు బయటపెట్టరనే ధీమాతో ఈ మాఫియా చెలరేగిపోతున్నది.