హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో పాలిటెక్నిక్ సెమిస్టర్ పరీక్షలపై సాంకేతిక విద్యామండలి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు పరీక్షలకు బదులుగా ఒకే ఎగ్జామ్ నిర్వహించాలని ఇటీవల నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. 2020- 21 విద్యాసంవత్సరానికి పాలిటెక్నిక్ విద్యార్థులకు 1, 2, 4 సెమిస్టర్లతోపాటు 5వ సెమిస్టర్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్కు వెళ్లగా, మిగిలిన 50 శాతం పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నది. వీరికి ఏటా మిడ్- 1, మిడ్- 2, ఎండ్ ఎగ్జామ్స్ పేరుతో మూడు రకాల పరీక్షలు నిర్వహించేవారు. రెండు మిడ్ పరీక్షలను 20 మార్కుల చొప్పున, ఎండ్ ఎగ్జామ్ను 40 మార్కులకు నిర్వహించేవారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు మాత్రమే నిర్వహించగా, మిడ్ ఎగ్జామ్స్ నిర్వహించలేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో మిడ్ ఎగ్జామ్స్ను రద్దుచేసి ఎండ్ ఎగ్జామ్ మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. మూడింటి మార్కులను కలిపి 80 మార్కులకు ఒకే పరీక్ష నిర్వహించనున్నారు. ఫలితాల్లో మాత్రం మార్కులను వేర్వేరుగా అంటే 80 మార్కులకు విద్యార్థి పొందిన మొత్తం మార్కుల్లో మిడ్-1కు 25 శాతం, మిడ్-2కు 25 శాతం, ఎండ్ ఎగ్జామ్కు 50 శాతం మార్కులు పొందినట్టు మెమోలు ఇవ్వనున్నారు.