మునిపల్లి, మే 14: పిడుగుపడి తండ్రీకొడులు మృతి చెందిన ఘటన మునిపల్లి మండలంలోని మొగ్దుంపల్లిలో శుక్రవారం చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొగ్దుంపల్లికి చెందిన కృష్ణ(36), కొడుకు ప్రశాంత్ (10)లు పొలంలో వ్యవసాయ పనుల నిమిత్తం వారి పొలంలో పనులు చేస్తున్న క్రమంలో ఉరుములు, మెరుపులు రావడంతో పొలంలో ఉన్న ఓ చెట్టు కిందకి వెళ్లి నిలబడ్డారు. అంతలోనే పిడుగుపడి చెట్టుకింద నిలబడ్డ తండ్రీకొడుకులు అక్కడిక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని విలపించారు. సంఘటనా స్థలానికి మునిపల్లి ఎస్ఐ మహేశ్వర్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాలను సదాశివపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పిడుగుపడి కుటుంబ పెద్ద అయిన కృష్ణ మృతి చెందడంతో ఆ కుటుంబం అనాథగా మారిందని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్లు అశోక్, సంగమేశ్వర్ తెలిపారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా, ఇదే మండల పరిధిలోని మళసంగం గ్రామానికి చెందిన బుడ్డోల్ల బాగయ్య (32) పశువులను మేపేందుకు మొగ్దుంపల్లి శివారుకు వెళ్లగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో కృష్ణ, ప్రశాంత్ల వద్దకు వెళ్లి నిలబడ్డాడు. వారు నిలబడ్డ చోటే పిడుగు పడడంతో తండ్రీ కొడుకు మృతి చెందగా, బాగయ్యకు తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించారు.
పుల్కల్లో..
పుల్కల్, మే 14: పిడుగు పడి ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని పోచారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం గ్రామానికి చెందిన చంటి ఏసు, కొనదొడ్డి నర్సింహులు మేకలను మేపడానికి వెళ్లగా బుసరెడ్డిపల్లి చంద్రయ్య(55) బర్రెను మేపడానికి వెళ్లారు. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురువడంతో సమీపంలో చెట్ల కిందికి వెళ్లారు. ఆ సమయంలో పిడుగు పడటంతో బుసరెడ్డిపల్లి చంద్రయ్య(55) అక్కడికక్కడే మృతిచెందగా, చంటి ఏసు కాలికి గాయమైంది. ఈ సంఘటనలో 5 మేకలు కూడ మృతి చెందాయి. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.
కంగ్టిలో
కంగ్టి, మే 14: పిడుగుపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని తడ్కల్ శివారులో శుక్రవారం చోటుచేసుకున్నది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. బోర్గి గ్రామానికి చెందిన సురేశ్ (34)కు తడ్కల్ గ్రామశివారులో పొలం ఉంది. మధ్యాహ్నం వేళ సురేశ్ తమ పొలానికి మేత కొయ్యడానికి వెళ్లగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు రావడంతో పిడుగుపడింది. దీంతో సురేశ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య గయాబాయి, కొడుకు, కూతురు ఉన్నారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయంచేసి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
అనుమానాస్పదంగా కార్మికుడి మృతి
గుమ్మడిదల, మే 14: అనుమానాస్పదస్థితిలో ఒడిషా రాష్ట్రానికి చెందిన ఓ కార్మికుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని అన్నారంలో శుక్రవారం చోటుచేసుకున్నది. ఎస్ఐ విజయకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మే 11తేదీ రాత్రి 10గంటల సమయంలో ఒడిషా రాష్ట్రానికి చెందిన హిమాన్షు పటేల్(23) కనపడకుండా వెళ్లడంతో భార్య, ఇతర ఇటుక బట్టీల కార్మికులు వెతుకగా ఆచూకీ లభించలేదు. కాగా, 13వ తేదీన సాయంత్రం ఇటుక బట్టీల వద్ద పని చేస్తున్న ఓ కార్మికుడు ఇటుకలు తీసే సమయంలో హిమాన్షుపటేల్ నిర్జీవంగా కనిపించాడు. వెంటనే కార్మికుడు ఇటుక బట్టీ యాజమానికి చెప్పగా ఆయన పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రాథమిక విచారణలో భాగంగా మృతుడి మెడపై, గొంతుకు కట్లు చూసి హత్య చేసినట్లుగా భావించి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి భార్య భిమాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.