సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 15: సమైక్య రాష్ట్రంలో కరువుతో విలవిలలాడిన ఈ ప్రాంతం.. నేడు పసిడి పంటలతో బంగారు తెలంగాణగా మారుతున్నదని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా టీడీపీ అధ్యక్షుడు గుండు భూపేశ్ 200 మంది అనుచరులతో మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీకి ప్రజల ఆదరణ లేకపోవడంతో ఆ పార్టీ నేతలంతా టీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు.
ఒక నాడు కరువుతో పట్టణంలో అంబలి కేంద్రాలు ఏర్పాటు చేసుకునేవాళ్లమని, నేడు పసిడి పంటలు పండి బంగారు తెలంగాణగా మారుతున్నదన్నారు. పొట్టచేత పట్టుకొని వలసపోయిన వారు నేడు తిరిగి వచ్చి పడావుపడ్డ భూములను సాగు చేసుకుంటున్నారని తెలిపారు. బీజేపీపాలిత కర్ణాటకలో పెన్షన్ రూ.500 ఇస్తే తెలంగాణలో రూ.2 వేలు, అక్కడ రైతులకు ఆరు గంటల కరెంటు ఇస్తే ఇక్కడ 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు అక్కడ లేవన్నారు. పేద ప్రజల నడ్డి విరవడంతోపాటు ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్న పార్టీ బీజేపీ అని ఆయన అభివర్ణించారు.
రాష్ట్ర వాటాలో కేంద్రం నిధుల కోత..
గ్రామాలు, పట్టణాల అభివృద్ధి కోసం ప్రతి నెలా రావాల్సిన రూ.699 కోట్లు తగ్గించిందని, కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి ఇచ్చే గ్రాంటులో 25 వేల కోట్లు కోత పెట్టిందని హరీశ్రావు విమర్శించారు. బీజేపీ తెలంగాణ రాష్ర్టానికి ఒక్క మంచి పనైనా చేసిందా? అని మంత్రి ప్రశ్నించారు.