భోపాల్ : కరోనా రోగిని చితకబాదిన ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఖండ్వాలో ఆదివారం చోటు చేసుకుంది. ఖండ్వాలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు ఆరోగ్య సిబ్బంది అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో హెల్త్ వర్కర్స్పై రోగి కుటుంబ సభ్యులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు.. ఖండ్వా చేరుకున్నారు. కరోనా రోగితో పాటు అతని కుటుంబ సభ్యులను పోలీసులు చితకబాదారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలపై ఖండ్వా ఎస్పీ వివేక్ సింగ్ స్పందించారు. కరోనా రోగిపై దాడి చేసిన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.