కూకట్పల్లి నియోజకవర్గంలో సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. సోమవారం కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని కేపీహెచ్బీ కాలనీ, బాలాజీనగర్ డివిజన్లలో పలు అభివృద్ధి పనులను మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డితో కలిసి ప్రారంభించారు. మొదటగా బాలాజీనగర్ డివిజన్లోని జేఎన్ఎన్యూఆర్ఎం గృహాల నుంచి ముళ్లకత్వ చెరువు వరకు రూ.95 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సమీప కాలనీలకు చెందిన వెల్ఫేర్ అసియేషన్ సభ్యులు వినతి పత్రాలు అందించి సమస్యలు తెలుపగా.. వాటికి మంత్రి సానుకూలంగా సమాధానాలు చెప్పారు.
కేపీహెచ్బీ కాలనీ హైటెక్సిటీ మార్గంలో రూ.70 కోట్లతో నిర్మించిన రైల్వే అండర్పాస్ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమం సందడిగా సాగింది. మంత్రులు కేటీఆర్, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, జడ్సీ మమత, స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు అండర్పాస్ బ్రిడ్జిని ప్రారంభించారు. ప్రారంభించిన తార్వత మంత్రి కేటీఆర్తో పాటు పలువురు నాయకులు నూతన బ్రిడ్జీపై ప్రయాణించారు. అనంతరం బ్రాహ్మణుల కోసం 500 గజాల స్థలంలో రూ.35 లక్షలతో నిర్మించిన పరికర్మల భవనాన్ని ప్రారంభించారు. బ్రాహ్మణులంతా వేద మంత్రాలతో మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, కృష్ణారావు, నవీన్కుమార్, శ్రీనివాస్రావులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి జడ్సీ వి.మమత, స్థానిక కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్రావు, పగుడాల శిరీషబాబూరావు పాల్గొన్నారు.
జేఎన్ఎన్యూఆర్ఎం గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయని.. వర్షం కురిస్తే స్లాబ్ల నుంచి నీరు కిందికి చేరుతుండడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని దీనిని మరమ్మతు పనులు చేయాలని కోరారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ జేఎన్ఎన్యూఆర్ఎం గృహాలలో సమస్యలను గుర్తించి త్వరితగతిన మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. కేపీహెచ్బీ కాలనీ 15వ ఫేజ్ (వెంకటరమణ కాలనీ) వాసులు డంపింగ్ యార్డును తొలగించాలని, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కోరగా మంత్రి మాట్లాడుతూ.. డంపింగ్ యార్డులో చెత్తాచెదారం నిల్వకుండా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఫతేనగర్లో కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్ను ఏర్పాటు చేశామని ఆ విధానాన్ని కాలనీవాసులు పరిశీలించాలన్నారు. ఇక్కడ కూడా శాస్త్రీయంగా చెత్తను తరలించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.
కూకట్పల్లి బార్ అసోసియేషన్ సభ్యులు నూతనంగా నిర్మిస్తున్న కోర్టు భవనానికి రోడ్డును వేయాలని, ఈ ప్రాంతంలో పార్కును అభివృద్ధి చేయాలని కోరగా మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి రోడ్డు, పార్కు సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సేవాలాల్నగర్, రాఘవేంద్ర కాలనీ, కైత్లాపూర్ గ్రామాలకు చెందిన ప్రజలు శ్మశానవాటికి స్థలంలో ఐడీఎల్ సంస్థ ప్రహరీ నిర్మిస్తున్నదని తరతరాలుగా స్థానిక ప్రజలు ఉపయోగిస్తున్న శ్మశానవాటిక లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేయగా సంబంధిత యాజమాన్యంతో చర్చించి సమస్య పరిష్కారమయ్యేలా కృషి చేస్తానన్నారు.