మన్సూరాబాద్ : ఫతుల్లాగూడలో నిర్మిస్తున్న వైకుంఠధామాన్ని అత్యున్నత ప్రమాణాలతో నిర్మిస్తున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ బండ్లగూడ పరిధి ఫతుల్లాగూడలో రూ. 18 కోట్లతో నిర్మిస్తున్న వైకుంఠధామంలో పచ్చదనం కోసం చేపట్టిన బిందు సేద్యం పనులను ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశంతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. జంటనగరాలలోనే కాకుండా రాష్ట్రం లో ఎక్కడా లేనివిధంగా పర్యావరణ రహితమైన మహాప్రస్థానాన్ని ఫతుల్లాగూడలో అన్ని వర్గాలకు అన్ని వసతులతో నిర్మిస్తున్నామని తెలిపారు. బ్రాహ్మణ సోదరులు కర్మకాండలు నిర్వహించుకునేందుకు ఓ భవనాన్ని సైతం నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.