హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు విజయవంతంగా ముగిసాయి. తొమ్మిది రోజులపాటు సాగిన సమావేశాల్లో ప్రజల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 15న గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన సమావేశాలు శుక్రవారం వరకు జరిగాయి. అనంతరం అసెంబ్లీ, శాసనమండలి నిరవధికంగా వాయిదా పడ్డాయి. శాసనమండలి సమావేశాలు ఐదు రోజులపాటు జరిగాయి. ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగిన అనంతరం ప్రభుత్వం సమాధానమిచ్చింది. ఆ తరువాత బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లుపై కూడా ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. శాసనసభలో పద్దులపై చర్చ రాత్రి 9.30గంటలకు వరకు సాగింది. ఈ సమావేశాల్లో నాలుగు బిల్లులు ఆమోదం పొందాయి. ప్రతిపక్షాలకు వారి సంఖ్యకు అనుగుణంగా మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. సీఎం కేసీఆర్ ఉద్యోగులకు పీఆర్సీపై ప్రకటన చేయగా, మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాసంస్థల మూతపై ప్రకటన చేశారు. మొత్తంగా 75 మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. 35 ప్రశ్నలకు సభలో సమాధానమిచ్చారు. మండలిలో 17 ప్రశ్నలకు సమాధానమిచ్చారు. లిఖిత పూర్వకంగా 32 ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 30 మంది ఎమ్మెల్సీలు సభలో ప్రసంగించారు. నాలుగు బిల్లులను ఆమోదించారు.
సమావేశాలు హుందాతనాన్ని ప్రతిబింబించాయి: మంత్రి ప్రశాంత్రెడ్డి
అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు హుందాతనాన్ని ప్రతిబింబించాయని శాసనసభ వ్యవహరాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో సమావేశాల ప్రారంభం నుంచి చివరి వరకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలతో ఉభయ సభలు జరిగాయని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి దోహదం చేసే భారీ బడ్జెట్ను ఉభయ సభలు ఆమోదించాయన్నారు. పద్దులన్నింటిపై సమగ్ర చర్చ జరిగిందని, గతంలో గిలెటన్ అయ్యేవని ఆయన తెలిపారు. ప్రతిపక్ష సభ్యులకు వారి సంఖ్యా బలానికి మించి వారు అడిగినంత సమయాన్ని స్పీకర్ ఇచ్చారని చెప్పారు. సభ అంతరాయం మీద కాకుండా నిర్మాణాత్మక చర్చలకే ప్రాధాన్యం ఇచ్చిన పాలక, ప్రతిపక్ష సభ్యులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత తెలంగాణ చట్ట సభలు దేశానికి ఆదర్శంగా మారాయన్నారు.
డిజిటలైజ్ సమావేశాలు..
అసెంబ్లీలో సమావేశాలు పూర్తిస్థాయిలో కాగితరహితంగా జరిగాయి. బడ్జెట్ ప్రతులను పెన్డ్రైవ్లో నిక్ష్లిప్తంచేసి పంపిణీచేశారు. కాగ్ నివేదికలు, సోషి యో ఎకనమిక్ సర్వేలను పూర్తిగా డిజిటల్ రూపంలోనే మీడియాకు, ఇతరులకు అందించారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధుల వివరాలను కూడా డిజిటల్ రూపంలోనే సభ్యులకు ఇచ్చారు. అసెంబ్లీని ఈ-ఆఫీస్ విధానంలో నడిపించాలనే ఉద్దేశంలో భాగంగా సభ్యులకు ఐప్యాడ్ను అందించారు. తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో ఎక్కువ సమ యం బడ్జెట్ చదివిన రికార్డును ఆర్థికమంత్రి హరీశ్రావు సొంతం చేసుకున్నారు. దాదాపుగా 90 నిమిషాలపాటు ఆయన బడ్జెట్ను చదివారు.