సూర్యాపేట : కూరగాయల పంట సాగుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు అందిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్ది వెల్లడించారు. మిద్దె తోటల పెంపకం వైపు ప్రజలు మొగ్గు చూపుతుండటం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. కూరగాయల పంట సాగుపై శనివారం శాసనమండలిలో జరిగిన చర్చలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో మిద్దెల తోటల పెంపకం పెరిగిందని వెల్లడించారు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అందించిన ప్రోత్సాహం అభినందనీయమని అన్నారు. సూర్యాపేటలో 1500 మందికి పైగా మిద్దెల తోటలు సాగు చేస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 143 పట్టణ ప్రాంతాల్లో 13 కార్పొరేషన్ల పరిధిలో కూరగాయల సాగుకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తున్నది చెప్పారు.