న్యూఢిల్లీ, మార్చి 18: రిలయన్స్, ఫ్యూచర్ రిటైల్ సంస్థల మధ్య కుదిరిన రూ.24,713 కోట్ల ఒప్పందానికి మళ్లీ బ్రేకులు పడ్డాయి. ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలన్న సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పిటిషన్ మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నది. కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూపు ఉద్దేశపూర్వకంగానే ఎస్ఐఏసీ ఉత్తర్వును ఉల్లంఘించిందని అభిప్రాయపడిన కోర్టు.. రిలయన్స్తో కుదిరిన ఒప్పందం విషయంలో తదుపరి చర్య చేపట్టరాదని ఫ్యూచర్ రిటైల్ను ఆదేశించింది. కిశోర్ బియానీ తదితరులు ఏప్రిల్ 28న ఢిల్లీ హైకోర్టుకు హాజరు కావాలని, వారి ఆస్తులను జప్తు చేయాలని జస్టిస్ జేఆర్ మిధా ఆదేశించారు. అంతేకాకుండా ఎస్ఐఏసీ ఆదేశాన్ని ఉల్లంఘించినందుకు మూడు నెలల పాటు జైలులో ఎందుకు నిర్బంధించకూడదో చెప్పాలని కోర్టు వారిని ప్రశ్నించింది.