అనధికార మరమ్మతులకు చెక్
నంబర్లతో ఎక్కడిదో సులువుగా గుర్తించే అవకాశం
నిర్మల్ జిల్లాలో 16,696 ట్రాన్ఫార్మర్లు..
10,156 డిజిటలైజేషన్ పూర్తి
సారంగాపూర్, మార్చి 18: విద్యుత్శాఖ ట్రాన్స్ఫార్మర్లను డిజిటలైజేషన్ చేస్తున్నది. వేసవిలో పలు కారణాలతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండడం సహజమే. కానీ.. విద్యుత్శాఖ కార్యాలయానికి తెచ్చిన ట్రాన్స్ఫార్మర్ ఫలానాది అని తెలిసేది కాదు. ఈ క్రమంలో అనధికార ట్రాన్స్ఫార్మర్లు కూడా మరమ్మతులకు వస్తున్నాయని అధికారులు గుర్తించారు. వీటికి చెక్ పెట్టేందుకు ఆ శాఖ చర్యలు తీసుకుంటున్నది. నిర్మల్ జిల్లాలోని అన్ని ట్రాన్స్ఫార్మర్లకు నంబర్లు వేస్తూ వాటిని డిజిటలైజేషన్ చేస్తున్నది. దీంతో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుకు వెళితే.. అది ఎక్కడిది, దాని పరిధిలో ఎన్ని కనెక్షన్లు ఉన్నాయన్న విషయం ఆన్లైన్లో తెలిసిపోతుంది. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు అయ్యే వరకు వేరేది ఏర్పాటు చేసి ఇబ్బందులు తొలగించనున్నారు.
వేసవిలో తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, వీటిని మరమ్మతుకేంద్రాలకు తీసుకుని రావడం సహజమే. వీటిలో అనధికార ట్రాన్స్ఫార్మర్లు కూడా వస్తుండడంతో అధికారులు, సిబ్బందికి ఇబ్బందిగా మారింది. దీంతో పాటు మరమ్మతుల్లో జాప్యం జరిగితే నీరందక పంటలు ఎండిపోయే ప్రమాదమున్నది. దీనికి పరిష్కారంగా అనధికార, అధికార ట్రాన్స్ఫార్మర్ల లెక్కను పక్కాగా తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు విద్యుత్ శాఖ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ట్రాన్స్ఫార్మర్ల డిజిటలైజేషన్కు కసరత్తు మొదలు పెట్టింది. నిర్మల్ జిల్లా పరిధిలో మూడు మున్సిపాలిటీలు, 18 మండలాలు, 396 గ్రామపంచాయతీలు, ఐదు విద్యుత్ సబ్డివిజన్లలో వ్యవసాయ విద్యుత్ వినియోగ ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి డిజిటలైజేషన్ చేస్తున్నారు. 25, 63, 100, 160, 250, 315 కిలోవాట్లు కలిగిన ట్రాన్స్ఫార్మర్లు జిల్లాలో 16,696 వరకు ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు 10,156 ట్రాన్స్ఫార్మర్లకు డిజిటలైజేషన్ చేశారు. మిగతా 6,657 ట్రాన్స్ఫార్మర్లకు డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. ట్రాన్స్ఫార్మర్లను క్రమబద్ధీకరణ కోసం పలుమార్లు అవకాశం కల్పించినా రైతులు కొందరు వాటిని నమోదు చేయించలేదు. మొబైల్ నంబర్ ద్వారా ట్రాన్స్ఫార్మర్లను ఆన్లైన్లో అనుసంధానం చేస్తున్నారు. ఉపకేంద్రం పేరు, ఫీడర్, ప్రాంతం, దాని పరిధిలోని సర్వీసులు దానిపై ఉన్న ప్రత్యేక గుర్తింపు సంఖ్య, సామర్థ్యం తదితర వివరాల నిక్షిప్తం చేస్తున్నారు. దీంతో జిల్లాస్థాయి విద్యుత్ శాఖ అధికారులతో పాటు కొత్తగా నియామకమైన వారికి సైతం ట్రాన్స్ఫార్మర్ల పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. డిజిటలైజేషన్తో అనధికార ట్రాన్స్ఫార్మర్ల గుర్తింపుతో పాటు పూర్తి స్థాయిలో క్రమబద్ధీకరణకు అవకాశం ఉంటుంది.
విద్యుత్ సమస్యలకు సత్వర పరిష్కారం..
ఏదైనా సమస్య తలెత్తితే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగానే ఆ ట్రాన్స్ఫార్మర్ నంబర్ను ఆన్లైన్లో చూడగానే ప్రదేశంతో పాటు పూర్తి వివరాలు కనిపిస్తాయి. దీంతో దాని పరిధిలోని సర్వీసులు, వరుస సంఖ్య నిర్ధారణ పరీక్ష నిర్వహించిన అనంతరం మరమ్మతులకు పంపిస్తారు. అప్పటి వరకు మరో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తారు. దీంతో రైతులతో పాటు, గృహ, పరిశ్రమల విద్యుత్ వినియోగదారుల సమస్యలు తీరనున్నాయి.
అందుబాటులో సమాచారం…
ట్రాన్స్ఫార్మర్లు డిజిటలైజేషన్ చేస్తే లెక్క పక్కాగా ఉండి సమాచారం అందుబాటులో ఉంటుంది. నిర్మల్ జిల్లాలో వివిధ రకాల ట్రాన్స్ఫార్మర్లు 16,696 ఉన్నాయి. ఇప్పటి వరకు 10,156 ట్రాన్స్ఫార్మర్లు డిజిటలైజేషన్ చేశాం. ప్రస్తుతం పంటపొలాలు ఉండడంతో 6657 డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. పంటల కోతల అనంతరం ఏప్రిల్ వరకు మిగతా వాటిని పూర్తి చేస్తాం.
-బీఆర్. చౌహాన్, ట్రాన్స్కో ఎస్ఈ, నిర్మల్ జిల్లా