ప్రత్యేక ప్రతినిధి, మార్చి17 (నమస్తే తెలంగాణ): ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) విధానాన్ని దేశవ్యాప్తంగానే నిలిపివేశామని కేంద్ర ప్రభుత్వం మరోమారు స్పష్టంచేసింది. పారిశ్రామికరంగాన్ని అభివృద్ధి చేయడానికి ఐటీఐఆర్ ద్వారా సాధించాలనుకున్న లక్ష్యాల కోసం ఇతర పథకాలను అమలుచేస్తున్నామని తెలిపింది. ఎలక్ట్రానిక్, పారిశ్రామిక క్లస్టర్లు, టౌన్షిప్లను ప్రోత్సహించడం ద్వారా ఆ లక్ష్యాలను సాధిస్తున్నామని పేర్కొన్నది. తెలంగాణలో ఐటీఐఆర్ విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తమతో మొదటి నుంచి సంప్రదింపులు జరుపుతూనే ఉన్నదని తెలిపింది. ఇటీవల కూడా ఐటీఐఆర్ లేదా అంతకన్నా మెరుగైన పథకాన్ని మంజూరు చేయాలని కోరిందని, అది కేంద్రం పరిశీలనలో ఉన్నదని పేర్కొన్నది.
‘తెలంగాణలో ఐటీఐఆర్ను నెలకొల్పుతున్నారా? రాష్ట్ర ముఖ్యమంత్రి ఐటీఐఆర్ను నెలకొల్పాలని 2014లో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారా? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 2014 సెప్టెంబర్లో సవివరమైన మెమోరాండంను అందజేసిందా? 2016 జూన్లో ఐటీఐఆర్కు సంబంధించిన సమగ్ర నివేదికను పంపించిందా? ఆ తర్వాత ఐటీఐఆర్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసింది? ఈ ఏడాది జనవరిలో ఐటీఐఆర్ కోసం నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందా? ఐటీఐఆర్ను నెలకొల్పడంలో జాప్యానికి కారణాలేమిటి? వివరించండి’ అని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జీ రంజిత్రెడ్డి లోక్సభలో కేంద్రాన్ని కోరారు. ఇందుకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే బుధవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
ఐటీఐఆర్ పాలసీ- 2008పై జరిపిన సమీక్ష ఆధారంగా తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా దాని అమలును నిలిపివేసిందని తెలిపారు. దేశంలో పారిశ్రామికరంగాన్ని అభివృద్ధి చేయడానికి డీఎంఐసీ, స్మార్ట్ సిటీస్, ఇండస్ట్రియల్/ఎలక్ట్రానిక్స్ పార్కులు వంటి పథకాలను అమలు చేస్తున్నామని, అందువల్ల ఐటీఐఆర్ అవసరం లేదని భావించామని చెప్పారు. హైదరాబాద్లో ఐటీఐఆర్ను నెలకొల్పడానికి మౌలిక సదుపాయాలు, ఇతర వసతుల అభివృద్ధి కోసం 2013, నవంబర్లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీచేసిందని తెలిపారు. హైదరాబాద్లో ఐటీఐఆర్ను స్థాపించేందుకు అదనపు నిధులు సమకూర్చాలని కోరుతూ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి 2014, సెప్టెంబర్లో లేఖరాశారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 2018లో రెండుసార్లు, 2021లో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తులు వచ్చినట్టు మంత్రి స్పష్టం చేశారు. ఐటీఐఆర్ పథకాన్ని పునరుద్ధరించాలని లేదా దాని స్థానంలో అంతకన్నా మెరుగైన పథకాన్ని మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ ఐటీ శాఖమంత్రి కే తారకరామారావు ఈ ఏడాది జనవరి 7న లేఖ రాశారని వెల్లడించారు. ఈ అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉందని చెప్పారు.
తెలంగాణలో జోన్ల పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాలకు ఆమోదం తెలపాలని ఎంపీ రంజిత్రెడ్డి కేంద్రాన్ని కోరారు. లోక్సభలో బుధవారం రూల్ 377 కింద ఎంపీ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరో 2 జిల్లాలను ఏర్పాటుచేసిందని తెలిపారు. ప్రస్తుతం జోగులాంబ గద్వాల జోన్-7 కింద ఉన్న వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్-6 కిందకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. కొత్త జిల్లాలు, జోన్ల ఆమోదం అంశాలు కేంద్రం వద్ద ఇంకా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఇటీవల హైకోర్టు కూడా ఈ విషయంలో గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని ఆయన సభ దృష్టికి తెచ్చారు. గతంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ఉద్యోగ నోటిఫికేషన్ను ఇవ్వడానికి మార్గం సుగమం చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
వ్యాక్సిన్ల ఉత్పత్తికి, ఔషధరంగానికి ప్రధా న కేంద్రంగా ఉన్న హైదరాబాద్లో వైరాలజీ ల్యాబ్ను ఏర్పాటుచేయాలని ఎంపీ రంజిత్రెడ్డి కేంద్రాన్ని కోరారు. వైద్యారోగ్యంపై లోక్సభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ.. కరోనా వైరస్ను కట్టడి చేయడంలో కేంద్రం, తెలంగాణ రాష్ట్రం సఫలమయ్యాయని అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కావడం విశేషమని చెప్పారు. ప్రపంచం మొత్తానికి అవసరమైన వ్యాక్సిన్లలో మూడోవంతు హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. ‘ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్’లో భాగంగా నాలుగు వైరాలజీ ఇన్స్టిట్యూట్లను ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించిందని, అందులో ఒకటి హైదరాబాద్లో స్థాపించాలని కోరారు. దీనిపై ఇదివరకే తెలంగాణ ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. తెలంగాణలో 33 జిల్లాలున్నాయని, ఇంకా 17 జిల్లాలకు మెడికల్ కాలేజీలను మంజూరు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కుటుం బ, ఆరోగ్య సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులో తగిన ప్రాధాన్యమివ్వలేదని అన్నారు.