న్యూఢిల్లీ: ఒక మహిళ బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి కిందపడింది. ఒక వ్యక్తి ఆమెను తీసుకెళ్లి ఒకచోట పడేశాడు. ఆ మహిళ మరణానికి కారణమైన నిందితుడ్ని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 22 ఏండ్ల మహిళ ఉపాధి నిమిత్తం ఢిల్లీ వచ్చింది. ఇండ్లకు పనివాళ్లను సమకూర్చే ఏజెన్సీకి చెందిన 35 ఏండ్ల ముఖేష్ కుమార్ను ఆమె సంప్రదించింది.
అయితే ఇటీవల ఆమె అతడి ఇంటికి వెళ్లి తనకు రావాల్సిన డబ్బుల విషయంపై గట్టిగా నిలదీసింది. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున షకుర్పూర్లోని బిల్డింగ్ నాలుగో అంతస్తుపై నుంచి ఆ మహిళ కిందపడింది. పరుగున కిందకు వచ్చిన ముఖేష్ ఆమెను భుజంపై వేసుకుని అక్కడి నుంచి పరుగుతీశాడు. సమీపంలోని చెత్తకుండీ వద్ద మహిళను పడేశాడు. బిల్డింగ్ ముందు రక్తం మరకలపై ఇసుక చల్లాడు. అనంతరం అనుచరుడు జితిన్, కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తరప్రదేశ్లోని సొంతూరుకు కారులో వెళ్లసాగాడు.
మరోవైపు చెత్తకుండీ వద్ద మహిళ పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ నేపథ్యంలో స్థానిక సీసీటీవీల ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులు నిందితుడు ముఖేష్ను గుర్తించారు. లక్నో-ఆగ్ర హైవేపై కారులో వెళ్తున్న అతడ్ని అరెస్ట్ చేశారు. లభించిన ఆధారాల మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.