ప్రభుత్వవాహనాల రిజిస్ట్రేషన్లు బంద్
వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు
కోటి వాహనాలు తుక్కుగా మారే అవకాశం
కొత్త వాహనాల తయారీకి ఊతం.. ఉపాధి
ముసాయిదా విడుదల చేసిన కేంద్రప్రభుత్వం
న్యూఢిల్లీ, మార్చి 13: దేశంలో 15 ఏండ్లు దాటిన ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ రద్దు కానున్నది. 2022 ఏప్రిల్ 1వ తేదీనుంచి ఈ నిబంధన అమలు అవుతుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను కేంద్ర రోడ్డురవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసింది. దీనిపై 30 రోజుల్లోగా అభిప్రాయాలు తెలుపాలని సంబంధిత వర్గాలను కోరింది. కేంద్రప్రభుత్వంతోపాటు రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పురపాలికలు, ప్రభుత్వరంగ కంపెనీలు, స్వయంప్రతిపత్తిగల సంస్థల్లోని వాహనాలన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుందని ముసాయిదాలో పేర్కొంది. గత నెల 1న కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ప్రతిపాదించిన వాహనాల తుక్కు పాలసీలో భాగంగా ఈ ముసాయిదాను రూపొందించారు. ఈ ముసాయిదా అమల్లోకి వస్తే 15 ఏండ్లు దాటిన ప్రభుత్వ వాహనాలన్నింటినీ తుక్కుగా మార్చేయాల్సి ఉంటుంది. దాదాపు కోటి వాహనాలు తుక్కుగా మారే అవకాశం ఉన్నదని రోడ్డురవాణాశాఖ వెల్లడించింది. 20 ఏండ్లు దాటిన వ్యక్తిగత వాహనాలు, 15 ఏండ్లు దాటిన వాణిజ్య వాహనాలకు రిజిస్ట్రేషన్ పునరుద్ధరించకూడదని ప్రభుత్వం బడ్జెట్లో భాగంగా ప్రతిపాదించింది.
పాతవాహనాలు తుక్కుగా మారితే కొత్తవాహనాలకు డిమాండ్ పెరుగుతుందని, దాంతో ఈ రంగంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నదని రోడ్డురవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల వెల్లడించారు. ఈ పెట్టుబడుల కారణంగా దేశంలో 50 వేలమందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. కొత్తవాహనాల కంటే పాతవాహనాలు 10-12 శాతం అధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని తెలిపారు. పాతవాహనాలపై గ్రీన్ ట్యాక్స్ను కూడా విధించాలని ప్రభుత్వం భావిస్తున్నది. డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో సీఎన్జీ, ఎల్పీజీతో నడిచే హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించనున్నట్టు ప్రకటించింది.