పట్నా: బీహార్లో మంత్రి రామ్ సూరత్ రాయ్ సొదరుడికి సంబంధించిన పాఠశాలలో ఇటీవల భారీగా అక్రమ మద్యం పట్టుబడిన ఘటన ఆ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. బీహార్ అసెంబ్లీలో సైతం ఇవాళ ఇదే అంశంపై తీవ్ర దుమారం చెలరేగింది. మంత్రి సోదరుడి పాఠశాలలో మద్యం పట్టుబడినందున మంత్రి రామ్సూరత్ రాయ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షనేత తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు. దీంతో రాజుకున్న గొడవ చిలికిచిలికి గాలివానలా మారి చివరికి అధికార, విపక్ష సభ్యులు బాహాబాహీకి దిగేవరకు వెళ్లింది.
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల మంత్రి రామ్సూరత్ రాయ్ సోదరుడి పాఠశాలలో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. ఈ నేపథ్యంలో మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని తేజస్వి డిమాండ్ చేయడం అసెంబ్లీలో రభసకు కారణమైంది. అయితే, అసెంబ్లీలో గొడవ అనంతరం బయట మీడియాతో మాట్లాడిన మంత్రి రామ్సూరత్.. తేజస్వి డిమాండ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తన సోదరుడి పాఠశాలలో మద్యం దొరికితే తానెలా బాధ్యుడినవుతానని, తానెందుకు రాజీనామా చేయాలని ఆయన ప్రశ్నిస్తున్నారు.
తేజస్వి తండ్రి లాలూప్రసాద్ యాదవ్ నేరం చేసి జైలుశిక్ష అనుభవిస్తున్నాడు కాబట్టి తేజస్వియాదవ్ను రాజీనామా చేయమంటే చేస్తారా..? తేజస్వియాదవ్పై కేసులు ఉన్నందున ఆయన సోదరుడు తేజ్ప్రతాప్ యాదవ్ రాజీనామా చేస్తాడా..? అని మంత్రి మండిపడ్డారు. ఘటనపై దర్యాప్తు జరుగుతున్నదని, దర్యాప్తులో తన సోదరుడు తప్పు చేసినట్లు తేలితే జైలుకు పంపవచ్చని, అందులో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మంత్రి చెప్పారు.