సమస్యల పరిష్కారానికి పాటుపడతా
బొటానికల్ గార్డెన్లో వాణీదేవి ప్రచారం
శేరిలింగంపల్లి/వ్యవసాయ యూనివర్సిటీ, మార్చి 10: రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎస్ వాణీదేవి కోరారు. తనను గెలిపించి శాసనమండలికి పంపిస్తే సమస్యల పరిష్కారానికి పాటుపడుతానని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం తమ కుటుంబంపై చూపిన ఆప్యాయతను ఎప్పటికీ మరువబోమని అన్నారు. బుధవారం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని పీవీ పశువైద్యకళాశాల సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్లో వాకర్స్ అసోసియేషన్, వాకర్స్తో ప్రచారం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో వాణీదేవి మాట్లాడుతూ.. దేశం ఆపదలో ఉన్నప్పుడు లౌకికంగా, బాధ్యతగా ప్రధాని పదవి చేపట్టిన తన తండ్రి పీవీ నరసింహారావు జ్ఞాపకాలను గుర్తుచేశారు. ఇతర పార్టీల కన్నా తెలంగాణ ప్రభుత్వం గుర్తించి వెటర్నరీ విభాగానికి పీవీ పేరు పెట్టడం అభినందనీయమని చెప్పారు. తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వగానే ఇక్కడ విద్యనభ్యసిస్తున్నవారితోపాటు సిబ్బంది వచ్చి మద్దతునిచ్చారని గుర్తుచేశారు. పీవీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించినప్పుడు, సమావేశంలో తన తండ్రి గురించి మాట్లాడినప్పుడు వాణీదేవి కంట తడి పెట్టుకున్నారు. బొటానికల్ గార్డెన్లో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని, పట్టభద్రుల ఉన్న కుటుంబాలు ఆ పథకాలు దృష్టిలో ఉంచుకొని తమ విలువైన మొదటి ప్రాధాన్య ఓటును టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి వేసి బలపరచాలని కోరారు. బొటానికల్ గార్డెన్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ విప్లవ్కుమార్, కార్పొరేటర్లు రాగం నాగేందర్యాదవ్, హమీద్పటేల్, మంజుల రఘునాథ్రెడ్డి, దొడ్ల వెంకటేశ్గౌడ్, నార్నె శ్రీనివాస్రావు, రోజాదేవి, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, టీఆర్ఎస్ నాయకులు రఘునాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.