న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల కోసం 8 విడుతల్లో పోలింగ్ నిర్వహించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బెంగాల్లో ఎనిమిది విడుతల పోలింగ్ విషయమై పిటిషనర్ వాదనతో తాము ఏకీభవించడంలేదని, కేసును పూర్వాపరాలు పరిశీలించి ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది.
పశ్చిమబెంగాల్లో 8 విడుతల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ మనోహర్లాల్ శర్మ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కేరళ, పుదుచ్చేరి, తమిళనాడులో ఒకే విడుతలో, అసోంలో మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వహిస్తూ బెంగాల్లో మాత్రం 8 విడుతల్లో ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కింద ఇచ్చిన సమానత్వపు హక్కును ఉల్లంఘించినట్లు అవుతుందని పిటిషనర్ పేర్కొన్నారు.
అయితే, ఆ పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే, న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, వీ రామసుబ్రమణ్యన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఎన్నికలు సజావుగా నిర్వహించడం కోసం ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి రాజ్యాంగ ఉల్లంఘన లేదని పేర్కొంటూ పిటిషన్ను తోసిపుచ్చింది.