న్యూఢిల్లీ: తీహార్ జైల్లో విచారణ ఖైదీ హత్యకు గురికావడంపై ఢిల్లీ హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది. జైల్లో అంత సెక్యూరిటీ ఉండగా ఒక విచారణ ఖైదీని దారుణంగా పొడిచిచంపడం ఎలా సాధ్యమని న్యాయమూర్తి ప్రతిభా సింగ్ అధికారులను ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు కాల్పనిక కథల్లో మాత్రమే ఉంటాయని, నిజజీవితంలో ఇలాంటి హత్య జరుగడం ఆశ్చర్యంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఢిల్లీకే చెందిన దిల్సేర్ ఆజాద్ అనే వ్యక్తి ఓ కేసులో 2019, సెప్టెంబర్లో అరెస్టయ్యి విచారణ ఎదుర్కొంటున్న ఖైదీగా ఉన్నారు.
అయితే 2020, నవంబర్ 30న ఆయన తన సెల్లో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. హంతకుడు అతడిని తొమ్మిది కత్తిపోట్లు పొడిచి చంపాడు. జైలు అధికారుల నుంచి తన కొడుకు హత్య సమాచారం అందుకున్న మృతుడి తండ్రి అలీ షేర్ కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేశాడు. అనంతరం తన కొడుకు హత్యకు పరిహారంగా రూ.5 కోట్లు నష్టపరిహారం అందించాలంటూ లాయర్ల ద్వారా కోర్టులో పిటిషన్లు వేశాడు.
అలీ షేర్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు జైల్లో ఎవరికీ తెలియకుండా ఒక ఖైదీ హత్య జరుగడం ఏమిటని ప్రశ్నించింది. ఘటనకు సంబంధించి నమోదుచేసిన ఎఫ్ఐఆర్, విచారణకు సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. హత్య జరిగిన సమయంలో మృతుడి సెల్ పరిసరాల్లో సీసీ ఫుటేజ్ను కూడా వివరాలతోపాటు కోర్టుకు సబ్మిట్ చేయాలని సూచించింది. తదుపరి విచారణను మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది.