జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీల్లో పర్యటన
రూ.32.50 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కీలక పర్యటన
మహబూబ్నగర్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం పాలమూరులో పర్యటించనున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. కేటీఆర్తోపాటు మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీలు మన్నె శ్రీనివాస్రెడ్డి, పోతుగంటి రాములు, విప్ గువ్వల బాలరాజు, జడ్చర్ల ఎమ్మెల్యే డా.సి లక్ష్మారెడ్డి హాజరుకానున్నారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జడ్చర్లలో, మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు అచ్చంపేటలో జరిగే కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొననున్నారు. ఈ రెండు పురపాలికల్లో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న తరుణంలో మంత్రి కేటీఆర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకోనున్నది.
మున్సిపాలిటీలపై వరాల జల్లు..
జడ్చర్ల, అచ్చంపేట పట్టణాల్లో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. మంత్రి పర్యటనతో ఈ రెండు మున్సిపాలిటీలపై వరాల జల్లు కురిసే అవకాశం ఉన్నదని పలువురు భావిస్తున్నారు. జడ్చర్లలో మున్సిపాలిటీగా మారిన తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగనున్నాయి. తొలి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అందుకే మంత్రి కేటీఆర్ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం కనిపిస్తున్నది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన పట్టణంగా ఉన్న జడ్చర్లను మరింత అభివృద్ధి చేసేందుకు, ఈ ప్రాంతానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా వరాలు ప్రకటించే అవకాశం ఉన్నది. మరోవైపు అచ్చంపేటలో గత మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డులను టీఆర్ఎస్ గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ఈ సారి కూడా అదే పునరావృతం చేసేందుకు పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా అచ్చంపేటకు ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. నల్లమలకు ముఖద్వారం లాంటి అచ్చంపేటను మరింతగా అభివృద్ధి చేసేందుకు మంత్రి కేటీఆర్ నిధులు కేటాయిస్తారని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
మంత్రి పర్యటన..జడ్చర్లలో..
తాగునీటి వాటర్ట్యాంక్, కావేరమ్మపేట నుంచి గంగాపూర్కు బీటీ రోడ్డు, నల్ల చెరువు మినీ ట్యాంక్ బండ్ ప్రారంభోత్సవాలు, హౌసింగ్ బోర్డు కాలనీలో రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు, గంజ్లో బహిరంగ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం కేసీఆర్ అర్బన్ ఎకో పార్కులో భోజనం చేసి అచ్చంపేటకు వెళ్లనున్నారు.
అచ్చంపేట పట్టణంలో..
తెలుగుతల్లి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసిన తర్వాత అచ్చంపేటలో మంత్రి కేటీఆర్ పర్యటన ప్రారంభం కానున్నది. అంబేద్కర్ విజ్ఞాన భవన్ నిర్మాణానికి, వ్యవసాయ మార్కెట్ ప్రహరీ విస్తరణకు, స్మృతి వనం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఎన్టీఆర్ మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు. రోడ్డు డివైడర్, సెంట్రల్ లైటింగ్, అంబేద్కర్ కళాభవన్ను ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడనున్నారు. బహిరంగ సభ ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు.
అభివృద్ధే ఎజెండా..
అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. స్వరాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని ఈ ప్రాంతం ఇప్పుడు అన్ని విధాలా ప్రగతి పథాన నడుస్తున్నది. రెండు జాతీయ రహదారులు, రైల్వే డబుల్ లేన్ ఏర్పాటుతో జడ్చర్లలో ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతున్నది. ఫార్మాసెజ్తో ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి. ఇప్పుడు జడ్చర్ల మున్సిపాలిటీగా మారడంతో మరింత అభివృద్ధికి అవకాశం ఏర్పడింది. ఒక్క హౌసింగ్ బోర్డు కాలనీలోనే రూ.15 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. బస్టాండ్కు అతి సమీపంలో ఏర్పాటు చేసిన మినీ ట్యాంక్ బండ్లో స్థానికులు సేద తీరేందుకు అనువుగా ఉన్నది.
ఇవి కూడా చదవండి
బీసీ స్టడీ సర్కిళ్ల మంజూరుపై హర్షం
దివ్యాంగులకు ఎమ్మెల్సీ కవిత అండ
సీనియర్ జర్నలిస్ట్ జయప్రకాశ్ మృతి
ఢిల్లీకి బైలెల్లిన మామిడి రైలు