అలంపూర్, సెప్టెంబర్ 19: ప్రభుత్వ ఆదేశాల మేరకు 18 ఏండ్లు పైబడిన వారందరూ విధిగా టీకా వేయించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. ఆదివారం మండలంలోని లింగనవాయి, క్యాతూరు, బుక్కాపురం తదితర గ్రామాల్లో, అలంపూర్ మున్సిపాలిటీల్లో ఆయన పర్యటించారు. కొవిడ్ టీకా సెంటర్లను ఎంపీడీవో సుగుణకుమార్తో కలిసి సందర్శించి, వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూ చించారు. కొవిడ్ను అంతమొందించే వరకు నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అలంపూర్ ము న్సిపల్ చైర్ పర్సన్ మనోరమావెంకటేశ్, కమిషనర్ నిత్యానంద్, డాక్టర్ రామంచంద్రారెడ్డి, క్యాతూరు ఆరోగ్య సి బ్బంది, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆయ గ్రామాల్లో సిబ్బంది పాల్గొన్నారు.
మల్దకల్ మండలంలో..
మల్దకల్, సెప్టెంబర్ 19: కరోనా నిరోధక టీకాను 18 ఏండ్లు పైబడ్డ వారందరూ వేయించుకోవాలని ఎంపీడీవో కృష్ణయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంతోపాటు అమరవాయి, బిజ్వారం, ఎల్కూర్, ఉల్గేపల్లి గ్రామాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఎంపీడీవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజులుగా మండలంలోని అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతుందన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు శివజ్యోతి, అరుణ, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
24నుంచి వ్యాక్సినేషన్
ఎర్రవల్లిచౌరస్తా, సెప్టెంబర్ 19: ఇటిక్యాల మండలం ఎర్రవల్లిచౌరస్తాలోని బీసీ కమ్యూనిటీహాల్లో ఈనెల 24, 26, 27, 28 తేదీల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇటిక్యాల వైద్య అధికారి సురేశ్ ప్రకటనలో తెలిపారు. అదే విధంగా మంగళవారం బీచుపల్లిలో, 27నుంచి 28వరకు కొండపేట, 23నుంచి 25 వరకు తిమ్మాపూర్, 27నుంచి28 వరకు దువాసిపల్లి, 24నుంచి25వరకు బీ.వీరాపురం, 23వరకు ఆర్.గార్లపాడులో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని, వ్యాక్సిన్పై ప్రజల్లో ఎన్నో అపోహలు ఉన్నాయని, ఇప్పటికే పోలీసులు, వైద్యసిబ్బంది, జర్నలిస్టులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకున్నారని వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగలేదని, ప్రతిఒక్కరూ నిర్భయంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.
ధరూర్లో
ధరూరు, సెప్టెంబర్ 19: మండలంలోని వివిధ గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ చురుగ్గా కొనసాగుతున్నది. సర్పంచ్లు అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పిస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. మార్లబీడు వ్యాక్సినేషన్ సెంటర్ను పర్యవేక్షక అధికారి ఆంజనేయులు సందర్శించి వ్యాక్సినేషన్కు ప్రజాస్పందన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.
వ్యాక్సినేషన్ పర్యవేక్షణ
గట్టు, సెప్టెంబర్ 19: గట్టులో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సర్పంచ్ ధనలక్ష్మి ఆదివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్పై అవగాహన కల్పించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ వాక్సిన్ను వేయించుకోవాలని పిలుపునిచ్చారు. వందశాతం లక్ష్యాన్ని సాధించాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శుభావతి, ఏఎన్ఎం పార్వతి, అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ముమ్మరంగా కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్
అయిజ మున్సిపాలిటీతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. నాలుగు రోజులుగా అయిజ మున్సిపాలిటీతో పాటు మండలంలోని సబ్ సెంటర్ల పరిధిలో గుర్తించిన అర్హులకు కొవిడ్ టీకాను వైద్య సిబ్బంది ఇస్తున్నారు. మున్సిపాలిటీతోపాటు మండలంలో 63,903 మంది వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులుగా గుర్తించారు. గతంలోనే 13వేల మందికి పైగా టీకా తీసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్లో 50వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. నాలుగు రోజులుగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్లో 4, 500మందికి టీకా ఇచ్చినట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. కలెక్టర్ క్రాంతి, అదనపు కలెక్టర్ శ్రీహర్ష నిత్యం పర్యవేక్షిస్తూ వైద్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులను పురమాయిస్తున్నారు. వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల చివరిలోగా ప్రతి గ్రామం, ప్రతి వార్డులో వందశాతం అర్హులకు కొవిడ్ టీకా వేయించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. మున్సిపాలిటీతోపాటు మండలంలోని 28 గ్రామ పంచాయతీలలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్ల సహకారంతో అర్హులను గుర్తించి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు మండల ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ స్వరూపారాణి తెలిపారు. మున్సిపల్ చైర్మన్ చిన్న దేవన్న, ఇన్చార్జి ఎంపీపీ నాగేశ్వర్రెడ్డిల ఆదేశాలతో మండల, మున్సిపల్ అధికారులు వ్యాక్సినేషన్కు సహకరిస్తున్నారు. అర్హులందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు చ ర్యలు తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.