గద్వాల, సెప్టెంబర్24: గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లో గతంలో ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేసేవారు. దీంతో వానకాలంలో ప్రజలు అనేక రోగాలబారిన పడిన సంఘటనలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రత్యేకంగా చెత్తవాహనాలను ఏర్పాటు చేసింది. ఇంటివ ద్దకే చెత్తబండి వచ్చి చెత్తను సేకరిస్తున్నారు. సేకరించిన చెత్తను ఒకచోటకు తరలించి తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నారు. వేరు చేసిన చెత్తతో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నారు. తయారుచేసిన ఎరువును హరితహారం, ప్రకృతివనాల్లోని మొక్కలకు ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం ప్రతి గ్రామంలో సెగ్రిగ్రేషన్ షెడ్డు నిర్మించి, చెత్తను సేకరించేందుకు ట్రాక్టర్లను ఏర్పాటు చేసింది. దీంతో చెత్త సమస్య తీరింది. పట్టణ, గ్రామాలకు కొంతమేర ఆర్థిక చేయూత కలిగింది. జిల్లాలో 255 పంచాయతీలకు 238 పంచాయతీల్లో ఎరువు తయారుచేస్తున్నారు. చెత్త నుంచి సిరులు కురిపించేలా ప్రణాళిక రూపొందించారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతున్నది.
వర్మీ కంపోస్ట్ తయారీ విధానం
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో చెత్తను తరలించడానికి ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ను పంచాయతీ నిధులతో తీసుకునేలా చర్యలు తీసుకున్నది. దీంతోపాటు పారిశుధ్య పనులు చేపట్టడానికి కార్మికులను ఏర్పాటు చేసింది. కార్మికులు ట్రాక్టర్ ద్వారా నిత్యం గ్రామాల్లో చెత్తను సేకరిస్తున్నారు. సేకరించిన చెత్తను సెగ్రిగేషన్ షెడ్లో వేస్తారు. అనంతరం పారిశుధ్య సిబ్బంది చెత్తను వేరు చేస్తారు. కూరగాయల వేస్టేజీ, కోళ్ల వ్యర్థాలు, కుళ్లిపోయిన తినుబండారాలతో సేంద్రియ ఎరువు తయారు చేసేందుకు మరో పెద్ద అరను ఏర్పాటు చేశారు. అరల్లో చెత్తతోపాటు వానపాములు వదిలి దానిపై మట్టితోపాటు పేడ కప్పుతారు. అనంతరం పేడ నీటిని దానిపై పోస్తారు. కొన్నిరోజులు అలాగే ఉంచుతారు. తయారైన ఎరువును హరితహారం, పల్లె ప్రకృతివనంలో నాటిన మొక్కలకు వినియోగిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో సేంద్రియ ఎరువు ఉత్పత్తి అయితే రైతులకు విక్రయించనున్నట్లు పంచాయతీ అధికారులు చెబుతున్నారు. దీంతో పంచాయతీలకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
238 గ్రామాల్లో తయారీ
జోగుళాంబ గద్వాల జిల్లాలో 255పంచాయతీలకు గానూ చిన్న పంచాయతీలు మినహా 238 గ్రామాల్లో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నారు. గద్వాల మండలంలో 28, మల్దకల్లో 22, ధరూర్లో 24, గట్టులో 26, కేటీదొడ్డిలో 22, అలంపూర్లో 14, అయిజలో 23, ఇటిక్యాలలో 29, మానవపాడులో 16, రాజోళిలో 10, ఉండవెల్లిలో 15, వడ్డేపల్లి మండలంలోని 9 పంచాయతీల్లో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నారు.
హరితహారం, ప్రకృతివనాలకు వినియోగిస్తున్నాం
జిల్లాలో 255పంచాయతీలకు గానూ 238గ్రామాల్లో చెత్త ద్వారా వర్మీ కంపోస్ట్ తయారు చేయిస్తున్నాం. ఇండ్ల నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను వేరుచేసి ఎరువు తయారు చేయిస్తున్నాం. ప్రజలు చెత్త బయట వేయకుండా ఇంటి వద్దకు వచ్చే చెత్తబండిలో వేయాలని అవగాహన కల్పిస్తున్నాం. ప్రజల్లో చైతన్యం పెరిగింది. జిల్లాలో కొత్తపల్లి, ముండ్లదిన్నే, లింగన్వాయి, ఉప్పల తదితర గ్రామాల్లో వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నారు. – శ్యాంసుందర్, డీపీవో, జోగుళాంబ గద్వాల జిల్లా