గద్వాల న్యూటౌన్, సెప్టెంబర్ 27 : ఆడపిల్లలకు జన్మనివ్వడమే ఆ తల్లికి శాపమైంది. ముగ్గురూ ఆడపిల్లలు పుట్టారన్న కక్షతో భార్యను భర్త హత్య చేసిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. బంధువులు, పోలీసుల కథనం మేరకు.. వనపర్తి జిల్లా మదనాపురం గ్రామానికి చెందిన అన్నపూర్ణ అలియాస్ పల్లవి(26)కి రెండేండ్ల కిందట గద్వాల పట్టణానికి చెందిన వెంకటేశ్తో వివాహమైంది. గతేడాది పాప పుట్టింది. అయితే, ఈనెల 24న రెండో కాన్పులో మళ్లీ కవలలు(ఆడపిల్లలు)కు జన్మనిచ్చింది. ముగ్గురూ ఆడపిల్లలే కావడంతో వెంకటేశ్ భార్యపై ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరూ లేని సమయంలో పల్లవి నిద్రిస్తుండగా గొంతు నులిమి హత్య చేశాడు. పల్లవి కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చారు. ఆమెకు ఫిట్స్ వచ్చిందంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. స్థానికుల సాయంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే, పల్లవి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఇదిలా ఉండగా, భార్యను హత్య చేసిన వెంకటేశ్ తెలివిగా బయట పడేందుకు హైడ్రామా చేశాడు. స్థానికులు, బంధువులతో చెప్పిన మాటలు పొంతన లేకపోవడంతో వారు అనుమానం వ్యక్తం చేశారు. గొంతు నుమిలిన ఆనవాలు, కాట్లు ఉండడంతో సోమవారం ఉదయం బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
గద్వాల సీఐ షేక్ మహబూబ్బాషా వైద్యుల నివేదికలపై దర్యాప్తు చేశారు. పోస్టుమార్టంలో పల్లవి ఒంటిపై, గొంతుపై నులిమినట్లుగా తేలింది. మహిళను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు వెంకటేశ్, తల్లి జయమ్మ, జనార్దన్, లీలావతిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నడాని త్వరలో అదుపులోకి తీసుకుంటామని సీఐ తెలిపారు. వెంకటేశ్తోపాటు అతని కుటుంబ సభ్యులను శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులను కోరారు.