గద్వాల, జూలై 12: జిల్లాలో ఏర్పాటు చేసే పరిశ్రమల స్థాపనకు త్వరగా ప్రభుత్వ భూములు గుర్తించాలని రాష్ట్రప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్ కలెక్టర్లకు ఆదేశించారు. సోమవారం గద్వాల, నారాయణపేట, మహబూబ్నగర్, నల్గొండ, సంగారెడ్డి, యాద్రాది, సూర్యాపేట, సిద్దిపేట, మెదక్, మేడ్చల్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీసీలో ఆయన మాట్లాడారు. పట్టణంలో కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు ఉంటే వెంటనే వాటిని గుర్తించి ఔటర్రింగ్ రోడ్డు అవతల స్థాపించుటకు ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. కాలుష్యం నుంచి పట్టణాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు. కాలుష్య నివారణలో భాగంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. వీసీలో పాల్గొన్న కలెక్టర్ శృతిఓఝా మాట్లాడుతూ జిల్లాలో గట్టు మండలం రాయపురం గ్రామ సమీపంలో సర్వేనెంబర్ 83లో మొత్తం 300 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇంటిగ్రేటెడ్ ఐరన్ స్టీల్ ప్లాంట్ కోసం గుర్తించామన్నారు. పట్టణంలో కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను బయటకు తరలించడానికి ప్రణాళిక రూపొందించుకుని వాటిని బయటకు తరలిస్తామని చెప్పారు. వీసీలో అదనపు కలెక్టర్ రఘురాంశర్మ, ఆర్డీవో రాములు, అధికారులు పాల్గొన్నారు.