మంచిర్యాల : తన వివాహానికి సంబంధించిన చర్చలతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని జనగామ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. కోటపల్లి సబ్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మధుకర్ కూతురు హరిప్రియ(19) కరీంనగర్లోని కాలేజీలో డిగ్రీ చదువుతోంది. కాగా తన బావతో పెండ్లి నిశ్చయం తలపెట్టిన తండ్రి సంప్రదింపులు చేయసాగాడు. ఇష్టం లేని హరిప్రియ పురుగులమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చెన్నూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది.
బాధిత తండ్రి మధుకర్ తన సోదరికి రూ. 2 లక్షలు బాకీ పడ్డట్లుగా సమాచారం. ఈ రుణం గురించి చర్చల సందర్భంగా వివాహ ప్రతిపాదన వచ్చింది. ఇష్టం లేని పెండ్లి చర్చల కారణంగా మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.