కంటోన్మెంట్, జూన్ 25 : కంటోన్మెంట్లోని బీజేపీ నేతలు అసంబద్ధ ప్రేలాపనలు మానుకోవాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం కార్ఖానాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామకృష్ణకు అభివృద్ధి పనులపైన, టీఆర్ఎస్ ప్రభుత్వంపైన మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన సుమారు రూ.600కోట్ల బకాయిలను తెప్పించలేని అసమర్థతలో ఉండి ఇతరులపై బురదజల్లడం ఏమిటని ప్రశ్నించారు.
గతేడాది వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకుని మంత్రి కేటీఆర్ తక్షణ నిధుల కింద ప్యాట్నీ నాలా ఆధునీకరణకు రూ. 6 కోట్లు కేటాయించిన విషయం మరిచిపోయారా అని దుయ్యబట్టారు. కంటోన్మెంట్ పరిధి నుంచి ప్యాట్నీ నాలా విస్తరించి ఉండడంతో ఇటీవల కాలంలో మున్సిపల్ ఆడ్మినిస్ట్రేటివ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం గత ఏప్రిల్ 5వ తేదీన జీఓ నెం.286 ద్వారా ప్యాట్నీ నాలా ఆధునీకరణకు రూ. 10 కోట్ల నిధులు మంజూరు చేస్తూ పరిపాలన ఆదేశాలు జారీ చేశారన్నారు. బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, పాండుయాదవ్, నళినికిరణ్తో పాటు బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, గణేశ్ ఆలయం మాజీ చైర్మన్ పిట్ల నగేశ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.