బేల, ఏప్రిల్ 17 : మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని అదనపు కలెక్టర్ డేవిడ్ సూచించారు. శంకర్గూడ సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్ పోస్టును జిల్లా అధికారులతో కలిసి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర నుంచి రాకపోకలు సాగించే వారి వివరాలు నమోదు చేయాలన్నారు. పోలీస్ , రెవెన్యూ , పంచాయతీరాజ్ , వైద్యారోగ్యశాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. థర్మల్ స్క్రీనింగ్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంటే వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని సూచించారు. డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ శంకర్ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరినీ పరీక్షించాలి: అదనపు కలెక్టర్ రాజేశం
ఆసిఫాబాద్(వాంకిడి), ఏప్రిల్17 : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో నుంచి తెలంగాణకు వచ్చే ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ టెస్ట్ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం ఆదేశించారు. శనివారం చెక్పోస్ట్ను ఆయన సందర్శించారు. మహారాష్ట్ర మన జిల్లాకు ఆనుకొని ఉన్నందున్న రాకపోకలపై నిఘా పెట్టినట్లు తెలిపారు. జిల్లా వాసులు వీలైనంత వరకు మహారాష్ట్రకు వెళ్లవద్దని, అక్కడి వారిని ఇక్కడికి రానివ్వద్దని కోరారు. ఆయన వెంట తహసీల్దార్ మధుకర్ ,సిబ్బంది ఉన్నారు.