వ్యవసాయ యూనివర్సిటీ : స్వయం ఉపాధిలో శిక్షణ పొందిన యువకులు ఆయా రంగాలలో రాణిస్తే, ఆర్థిక లాభాలతో పాటు సమాజంలో గౌరవం పెరుగుతుందని బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ (బైరెడ్) డైరెక్టర్ విజయలక్ష్మి అన్నారు. 30 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో బుధవారం ఆమె పాల్గొని మాట్లాడారు. రెండు తెలుగు రాష్ర్టాల నుంచి వచ్చి నెలపాటు శ్రద్ధగా నేర్చుకున్నారని, ఇప్పటికే దాదాపు 15 మందికి కెరియర్, అర్బన్ కంపెనీలో ఉద్యోగులుగా అవకాశం రావడం వారి పట్టుదలకు నిదర్శనమన్నారు. మిగతా వారికి కూడా అవకాశాలు వస్తే వెళ్లడం, లేదా స్వయంగా షాపులు పెట్టుకునేందుకు, ఆయా బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. మొబైల్ సర్వీసింగ్ 17, ఏసీ రిఫ్రిజిరేటర్ 23, ఎలక్ట్రికల్, మోటర్ వైండింగ్ 11 మొత్తం 51 మంది శిక్షణ పొందారని పేర్కొన్నారు.
అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఆన్లైన్లో 900 దరఖాస్తులు రాగా తొలి విడతగా 90 మందిని ఎంపిక చేయగా వారిలో 51 మంది సద్వినియోగం చేసుకున్నారన్నారు. ప్రాథమిక విద్యార్హత ఉన్న గ్రామీణ యువతీ యువకులకు ఉచిత శిక్షణ వసతి, భోజనం బస్సు చార్జీలను సంస్థనే భరించిందన్నారు. రెండు తెలుగు రాష్ర్టాల నుంచి బైరెడ్ సంస్థ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తుందని, ఇప్పటి వరకు 562 శిక్షణా కార్యక్రమాల ద్వారా 16,446 మందికి ఉపాధి కల్పించామన్నారు. ఇప్పటికే 11518 మంది శిక్షణ పొంది స్థిరపడ్డారన్నారు. వీరిలో 8394 మంది మహిళలు, 7149 మంది పురుషులు ఉన్నారు. శారీరక ఆరోగ్యంతోపాటు వారి మానసిక ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఉదయం యోగా, ప్రాణయామం ధ్యానం నేర్పించి శిక్షణ పొందిన వారికి పతాంజలి సంస్థ నుంచి యోగా సర్టిఫికెట్లు ప్రదానం చేశామని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్స్ మోహన్, నాగేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.