కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించారు. రోజురోజుకూ పెరిగిపోతున్న ఇంధన ధరలను అరికట్టడంలో, వ్యాక్సిన్ కొరతను నివారించడంలో మోదీ సర్కారు పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. అంతేగాక ప్రధాని మోదీ ”మన్ కీ బాత్”కు బదులుగా ”పెట్రోల్ అండ్ వ్యాక్సిన్ కీ బాత్” చేయాలని సూచించారు. ఇవాళ కోల్కతాలో జరిగిన వర్చువల్ కాన్ఫరెన్స్లో మమత పై వ్యాఖ్యలు చేశారు.
కరోనా పరిస్థితుల్లో కూడా రాష్ట్రాలకు నిధులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తున్నదని మమత మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజల నడ్డివిరిచి, సొంత జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలలను వారంలో నాలుగుసార్లు పెంచారని, 10 నుంచి 12 రెట్లు ధరలు పెరుగడంతో ప్రజల నుంచి కేంద్రానికి రూ.3.71 లక్షల కోట్లు వచ్చాయని చెప్పారు.
కొవిడ్ వ్యాక్సిన్ల పేర రూ.35,000 కోట్లు కేటాయించి, సెకెండ్ వేవ్ మొదలైన తర్వాత కేంద్రం నత్తనడకన రాష్ట్రాలకు నిధులు విడుదల చేస్తే ఏం లాభమని మమత దుయ్యబట్టారు. తాము రూ.3 కోట్లు అడిగితే ఇవ్వలేదని, ఆరు నెలల్లో తమకు కేవలం రూ.2 కోట్లు మాత్రమే ఇచ్చారని ఆమె విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు అధిక నిధులు ఇస్తూ విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు తక్కువ నిధులిస్తున్నారని మండిపడ్డారు.