తిరుమలగిరి, మే 28 : నిత్యం ప్రజలతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉండే వారి కోసం ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్ వ్యాక్సినేషన్ ఏర్పాటు చేసిందని, సంబంధించిన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం మండలాల్లోని సూపర్ స్ప్రెడర్ వ్యాక్సిన్ కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ 28, 29 తేదీల్లో వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా రేషన్ డీలర్లు, ఎరువులు, విత్తనాల దుకాణాల యజమానులు, సిబ్బంది, పెట్రోల్ బంకుల నిర్వాహకులు, సిబ్బంది, గ్యాస్ సప్లయ్ ఉద్యోగులు, సిబ్బందితోపాటు మీడియా ప్రతినిధులు, కిరాణా షాపు యజమానులు, పండ్లు, కూరగాయలు, పూలు, మటన్, చికెన్, చేపల విక్రయదారులకు ఈ కార్యక్రమం ద్వారా టీకా వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తాసీల్దార్ సంతోష్కిరణ్, ఏఓ వెంకటేశ్వర్లు, పీహెచ్సీ డాక్టర్ ప్రశాంత్బాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఫ్రంట్లైన్ వారియర్స్కు ..
సూర్యాపేట అర్బన్ వ్యవసాయ మార్కెట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ సెంటర్లో మార్కెట్ సిబ్బందితోపాటు మీడియా ప్రతినిధులు, గ్యాస్ డెలివరీ సిబ్బంది, ఫర్టిలైజర్ షాపుల వారు, రేషన్ షాపుల నిర్వాహకులకు టీకాలు వేశారు. అంబేద్కర్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ రెండు రోజుల పాటు కొనసాగించనున్నారు. కార్య్రక్రమంలో డాక్టర్ రంగారెడ్డి, రవి, వెంకటేశ్వర్లు, ఏఎన్ఎంలు ధనమ్మ, సుకన్య, పుష్పలత, ఉమ పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలి
బొడ్రాయిబజార్ వ్యాక్సిన్తో ఎలాంటి ప్రమాదమూ ఉండదని, ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. సూర్యాపేటలోని రాజీవ్నగర్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. టీకా పంపిణీపై మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రతి నిమిషం సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, కౌన్సిలర్లు ఆకుల కవిత, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, వైద్యులు మురళీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
తుంగతుర్తి : ప్రభుత్వం అందిస్తున్న ఉచిత టీకాలను ఫ్రంట్ లైన్ వారియర్స్ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ డాక్టర్ నాగూనాయక్ అన్నారు మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానతోపాటు, జడ్పీ పాఠశాలలో వారియర్స్కు శుక్రవారం టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం మొత్తం 148 మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఈఓ గోవిందరెడ్డి, సిబ్బంది సముద్రాల సూరి, నర్సింహాచారి, స్వప్న, భారతి, కమల, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.