3.62 లక్షల ఎకరాల్లో సాగు అంచనా
అత్యధికంగా పత్తి, రెండో స్థానంలో వరి
రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు
సరిపడా విత్తనాలు, ఎరువుల కోసం ప్రతిపాదనలు
మంచిర్యాల, మే 31, నమస్తే తెలంగాణ :వానకాలం పంటల సాగుకు అన్నదాతలు సిద్ధమవుతుండగా, వ్యవసాయశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ యేడాది మంచిర్యాల జిల్లాలో 3.62 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నది. అత్యధికంగా పత్తి, రెండో స్థానంలో వరి సాగయ్యే అవకాశాలు ఉండగా, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నది. సరిపడా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేందుకు ఇప్పటికే సర్కారుకు ప్రతిపాదనలు పంపించింది. త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశముండగా,ఆ వెంటే రైతులకు పంపిణీ చేయనున్నది.
వానకాలం పంటకు సంబంధించి సాగు ప్రణాళికను అధికారులు రెడీ చేశారు. జిల్లాలో ఇప్పటికే యాసంగి పంటల కొనుగోళ్లు సాగుతున్నాయి. త్వరలో వర్షాకాలం పంటలు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు ఖరీఫ్ సీజన్కు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేశారు. విత్తనాలు, ఎరువుల కోసం నివేదికను రూపొందించారు. సాగుకు అవసరమైన ఎరువులను దశలవారీగా తెప్పించేందుకు ప్రణాళికను తయారు చేశారు. జిల్లాలో వానకాలంలో ప్రధానంగా పత్తి, వరి, కందులు, మినుములు, పెసలు పంటలు సాగు చేస్తుంటారు. కాగా జిల్లాకు సంబంధించిన వరి, పత్తి, పెసర, మక్కజొన్న, పల్లి, మినుములు, పెసలు, కందులకు సంబంధించిన ఇండెంట్ను మండలాలవారీగా తయారు చేశారు. కాగా, యాసంగి సీజన్లో వరి, మక్కజొన్న, నూనె విత్తనాల పంటలు ఎక్కువగా వేస్తుంటారు. కాగా జిల్లాలో ఏడాదిలో సాధారణ వర్షపాతం 1126.7 మిల్లీ మీటర్లుగా నమోదవుతున్నది. 52 శాతం మంది పంటలు వర్షాధారమైనవి. కాగా, 48 శాతం భూమిలో ప్రాజెక్టులు, చెరువులు, బావుల సాయంతో పంటలు పండిస్తున్నారు. జూన్ మూడో వారంలో వర్షాలు ప్రారంభమవుతాయి. జిల్లాలో సాధారణంగా 11 డిగ్రీల సెల్సియస్ నుంచి 25 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత, 30 నుంచి 48.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. జిల్లాలో 65 శాతం నల్ల నేలలు, 30 శాతం ఎరుపు, 5 శాతం ఇసుక నేలలు ఉన్నాయి.
3.62 లక్షల ఎకరాల్లో సాగు అంచనా..
జిల్లాలో ప్రధాన పంట పత్తి, వరి, పప్పులు కాగా, ఇతర పంటలనూ తక్కువ ఎకరాల్లో పండిస్తున్నారు. ఈ యేడాది జిల్లాలో 3,62,818 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 1.60 లక్షల ఎకరాల్లో వరి, 1. 90లక్షల ఎకరాల్లో పత్తి, 100 ఎకరాల్లో పల్లి, 900 ఎకరాల్లో పెసలు, 60 ఎకరాల్లో మినుములు, 11వేల ఎకరాల్లో కందులు, ఇతరాలు 300 ఎకరాల్లో పంట వేసేలా ప్రణాళికలు రచించారు. జిల్లాలో వ్యవసాయ భూమి 3,62,556 ఎకరాలు కాగా, ఉద్యానవన (హార్టికల్చర్) ప్రాంతం 20,749 ఎకరాల్లో ఉంది. ఇందుకోసం సరిపడా, విత్తనాలు, ఎరువులను పంపిణీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలను పంపించారు.
నీటి పారుదల వివరాలు..
కడెం భారీ నీటి పారుదల ప్రాజెక్టు కింద జిల్లాలో 25,081 హెక్టార్లలో ఆయకట్టు సాగవుతున్నది. మధ్య తరగతి ప్రాజెక్టులు మూడు ఉన్నాయి. ర్యాలీవాగు, నీల్వాయి, గొల్లవాగు మధ్య తరగతి ప్రాజెక్టుల కింద 2,833 హెక్టార్లలో, 897 చిన్న నీటి పారుదల ప్రాజెక్టుల్లో 33,202 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. గూడెం ఎత్తిపోతల కింద యాసంగిలో 25,081 హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నారు.
విత్తనాల కోసం నివేదికలు..
వానకాలం సీజన్లో పంటలకు సరిపడా విత్తనాలు తెప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 18 మండలాల వారీగా ఇండెంట్ తయారు చేసి నివేదికలు పంపించారు. పత్తి 4.75 లక్షల ప్యాకెట్లు, వరి 3,200 క్వింటాళ్లు, జొన్న 120.1 క్వింటాళ్లు, పల్లి 25.1 క్వింటాళ్లు, మినుములు 4.8 క్వింటాళ్లు, పెసలు 72 క్వింటాళ్లు, కందులు 880 క్వింటాళ్లు అవసరం ఉంటుందని అధికారులు అంచనావేశారు.