హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. లాక్డౌన్ సడలింపు సమయాన్ని పొడిగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సబ్రిజిస్ట్రార్, తాసిల్దార్ కార్యాలయాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. లాక్డౌన్ విధించడంతో ఈ నెల 12 నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వ్యవసాయ భూములకు సంబంధించి.. సోమవారం రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్నవారు నేరుగా తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లవచ్చని అధికారులు తెలిపారు. రోజులో బుక్ అయిన స్లాట్లన్నింటికీ నాలుగు గంటల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పూర్తిగా అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ పద్ధతిలో జరుగుతాయని పేర్కొన్నారు. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. అవసరమైతే ఆన్లైన్లోనే ఈ-పాస్ను కూడా జనరేట్ చేసుకోవచ్చని తెలిపారు.
త్వరలో రీషెడ్యూల్
ఈ నెల 12వ తేదీ నుంచి 29వ తేదీ మధ్య అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ చేసుకొని, లాక్డౌన్ వల్ల రిజిస్ట్రేషన్ చేసుకోలేనివారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించనున్నది. వారి స్లాట్లను త్వరలో రీషెడ్యూల్ చేయనున్నది. ఎప్పుడు రిజిస్ట్రేషన్కు రావాలో ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం ఇవ్వనున్నారు.