అమరావతి : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ప్రచార బరిలో సీఎం జగన్ దిగనున్నారు. జగన్ ప్రచారానికి ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ఈ నెల 14న ఆయన చిత్తూర్ జిల్లా రేణిగుంటలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనున్నట్లు తెలిసింది.
జగన్ ప్రచార సభ తేదీపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్నది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక విజయాన్ని అన్నిపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
దీంతో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అధికార వైసీపీ అందరికంటే ముందుగానే అభ్యర్థిని నిలిపి ప్రచారంలో దూసుకెళ్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నది.
ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి జోరుగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి మరోసారి పోటీ చేస్తున్నారు.
బీజేపీ-జనసేన తమ ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభను బరిలో నిలిపాయి. గురువారం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తిరుపతి రానున్నట్లు తెలిసింది.
ఇప్పటికే మాజీ మంత్రి లోకేశ్ ఇక్కడ మాకాం వేసి ఎన్నికల ప్రచార శైలిపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
తమ అభ్యర్థి తరపున జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ ముఖ్యనేతలు సైతం ఎన్నికల ప్రచారానికి రానుండటంతో ప్రచారం మరింత రసవత్తరంగా మారనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి