ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 6: కేంద్ర ప్రభుత్వంలో రెండు కోట్ల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు కేంద్రాన్ని డి మాండ్ చేశారు. ఏడేండ్లుగా కేంద్రం ఉద్యోగ భర్తీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దీనిపై సమగ్రంగా చర్చించేందుకు ఈ నెల 10న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఉద్యోగాల భర్తీలో కేంద్ర ప్రభుత్వ జాప్యా న్ని నిరసిస్తూ మంగళవారం ఓయూలో ‘కేంద్ర ప్రభుత్వం – ఉన్నత విద్య, ఉద్యోగాల భర్తీ’అనే అంశంపై సమావేశం నిర్వహించారు. అనంతరం విద్యార్థి నేతలు మాట్లాడు తూ.. ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం… ఏడేళ్లుగా విద్యార్థి, నిరుద్యోగులను మోసం చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలోని ఒక్కో వర్సిటీకి వెయ్యి కోట్ల నిధులను ప్రత్యేకంగా కేటాయించాలన్నారు. ఎస్సీ, మైనారిటీ విద్యార్థులకు నెట్ పరీక్షలో అర్హత సాధిస్తేనే ఫెలోషిప్ అనే నిబంధనను ఎత్తివేయాలని కోరారు. కేంద్రప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం విద్యను కాషాయీకరణ చేస్తున్నదని దుయ్యబట్టారు. దీనికి విద్యార్థి నాయకులు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, అడ్వకేట్లు, ఉద్యమకారులు, నిరుద్యోగులు హాజరవుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నేతలు భాస్కర్, దత్తాత్రేయ, వెంకటేశ్ చౌహాన్, అశోక్యాదవ్, హరీశ్గౌడ్, శ్రీనివాస్, చిరంజీవి బెస్త, కిశోర్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.