సాగు అంచనాకు అనుగుణంగా సిద్ధం
ఎక్కడికక్కడ దండిగా నిలువలు
పక్కా ప్రణాళికతో వ్యవసాయశాఖ
మండలాల వారీగా స్టాక్
క్షేత్రస్థాయికి చేరేలా చర్యలు
వరి నాట్లకు అవసరం మేర తీసుకెళ్తున్న రైతులు
అన్నదాతల్లో సర్వత్రా హర్షం
పెద్దపల్లి, జూన్ 26 (నమస్తే తెలంగాణ): విత్తనాలు, ఎరువులు ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ అన్నదాతకు సకాలంలో అందింది లేదు. అది వాన కాలమైనా.. యాసంగైనా.. వీటి కోసం రైతులు యుద్ధం చేయాల్సి వచ్చేది. సీజన్ ప్రారంభమై రోజులు గడుస్తున్నా విత్తనాలు అందేవి కావు. సగం సీజన్ గడిస్తే తప్ప ఎరువులు వచ్చేవి కావు. పీఏసీఎస్, డీసీఎమ్మెస్ విక్రయ కేంద్రాల వద్ద రైతులు బారులు తీరని రోజు ఉండేది కాదు. పత్తి విత్తనాల కోసం పోలీస్ స్టేషన్లో క్యూకట్టాల్సిన దుస్థితి కనిపించేది. రైతన్నలు రోడ్డెక్కకుండా వ్యవసాయ ఉత్పాదకాలు సాధించుకునే పరిస్థితి ఉండేది కాదు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వా త వ్యవసాయానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. గడిచిన ఆరేండ్లలో సీజన్ ప్రారంభానికి ముందే విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తెస్తున్నది. వీటిని కొనుగోలు చేసుకునేందుకు ప్రతి సీజన్కు ముందే రైతుబంధు కింద పెట్టబడి సహాయం అందిస్తున్నది.
మునుపెన్నడూ చూడని పరిస్థితి..
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవసరమైన ఇన్పుట్స్ను సకాలంలో అందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నది. ప్రతి సీజన్కు ముందుగా నే రైతుబంధు కింద ఎకరాకు 5 వేల చొప్పున అందిస్తున్నది. 24 గంటల నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్నది. ఇప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేసి బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నది. వానకాలం సీజన్కు సరిపడా విత్తనాలు, ఎరువులను ఇప్పటికే అందుబాటులో ఉంచింది. కొన్ని మండలాల్లో అవసరానికి మించి సిద్ధంగా ఉంచింది. దీంతో రైతులు ధీమాగా ఉన్నారు. సీజన్ ప్రారంభంకాగానే వ్యవసాయ పనులపైనే దృష్టి సారించబోతున్నారు. వ్యవసాయాన్ని పండుగలా చేసుకునేందుకు ఇంత కంటే ఇంకేం కావాలని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీజన్ ప్రారంభమైనా విత్తనాలు లేక, విత్తనాలు ఉన్నా నల్ల బజారులో వేలకు వేలు ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వచ్చేదని, ఇపుడు సీజన్ ప్రారం భం కాకముందే విత్తనాలు అందుబాటులోకి వస్తున్నాయని, ఎక్కడికి వెళ్లినా సులువుగా కొనుగోలు చేసుకోగులుతున్నామని చెబుతున్నారు.
జిల్లాలో వానకాలం పంట సాగుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. 2,89,004 ఎకరాల్లో పంటల సాగుకు అంచనా వేయడంతో పాటు అవసరమైన ఎరువులు, వివత్తనాలు అందుబాటులో ఉంచారు. 1,67,800 ఎకరాల్లో వరి, లక్ష ఎకరాల్లో పత్తి, 20 వేల ఎకరాల్లో కందులు, 632 ఎకరాల్లో మక్కలు, 412 ఎకరాల్లో పెసర, 159 ఎకరాల్లో ఇతర పంటలు వేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. వీటికి 48,801 క్వింటాళ్ల విత్తనాలు, 2 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. జిల్లాకు యూరియా 35, 794 మెట్రిక్ టన్నులు అవసరం కాగా, ప్రస్తుత అవసరాలకు సరిపడా 16,000 మెట్రిక్ టన్ను లు, డీఏపీ 6398.77 మెట్రిక్ టన్నులకు 2,980 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 21,125 మెట్రిక్ టన్నులకు 13690 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 6,392 మెట్రిక్ టన్నులకు 2,700 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచారు. కా గా, గతేడాది వానకాలం సాధారణ సాగు విస్తీర్ణం 2 లక్షల 17 వేలు కాగా, కాళేశ్వరం జలాలతో ఏకంగా అంచనా 72 వేల ఎకరాలు పెరిగింది.