-ఒడిశాలో వైద్య సిబ్బంది నిర్వాకం
భువనేశ్వర్, జూన్ 21: కరోనా టీకా వేయించుకోవడానికి వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లిన ఓ వ్యక్తికి అరగంట వ్యవధిలోనే రెండు డోసులు అందించిన ఘటన ఒడిశాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మయూర్భంజ్ జిల్లా రఘుపూర్ గ్రామానికి చెందిన ప్రసన్న కుమార్ సాహు.. గత శనివారం కుంటాపూర్లో ఉన్న ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకున్నాడు. అనంతరం అక్కడ వేచి ఉండగా, ఒక నర్సు అతడి దగ్గరికి వచ్చి మరోసారి టీకా వేసింది. తాను వద్దని వారిస్తున్నా టీకా వేశారని సాహు ఆరోపించాడు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం సాహులో ఎలాంటి దుష్ప్రభావాలూ లేవని అధికారులు తెలిపారు.